అమెరికాలో మనవాళ్లపై కరోనా ప్రభావం తక్కువే: వెన్నం మురళి
ABN , First Publish Date - 2020-04-25T03:16:25+05:30 IST
కరోనా కోరల్లో చిక్కి అగ్రరాజ్యం అమెరికా అతలాకుతలం అవుతున్న విషయం తెలిసిందే. దీంతో చదువు కోసమో, ఉద్యోగాల కోసమో మనదేశం నుంచి, రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లి అమెరికాలో ఉంటున్న వారిపై కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు.
అమెరికన్స్ కంటే మనోళ్లే బెటర్
దీనికి ఆహారపు అలవాట్లే కారణం
తెలుగు వారికి అన్ని విధాలా అండ
వైద్య సేవల్లో మనవారే ముందు
ఆంధ్రజ్యోతితో 'తానా' వెన్నం మురళి
గుంటూరు(ఆంధ్రజ్యోతి): కరోనా కోరల్లో చిక్కి అగ్రరాజ్యం అమెరికా అతలాకుతలం అవుతున్న విషయం తెలిసిందే. దీంతో చదువు కోసమో, ఉద్యోగాల కోసమో మనదేశం నుంచి, రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లి అమెరికాలో ఉంటున్న వారిపై కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. కరోనా నేపథ్యంలో అక్కడ మనవాళ్లు ఎన్ని తిప్పలు పడుతున్నారో ఎలా ఉంటున్నారో ప్రభుత్వం ఆదుకుంటుందో లేదో వంటి అనేక సందేహాలు వీరిని చుట్టుముట్టాయి. ఈ క్రమంలో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ప్రవాసాంధ్రుడు, ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) వెన్నం మురళితో ఆంధ్రజ్యోతి ఆయా అంశాలపై ఫోన్ ద్వారా చర్చించింది. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ... ప్రవాసాంధ్రులు, భారత విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమేనని, అయితే, వారికి ఇక్కడి సంఘాలు సాయం చేస్తున్నాయని వివరించారు.
కరోనా ప్రభావం మనవారిపై ఎలా ఉంది?
అగ్రరాజ్యంలో తెలుగు వారు నివసించే న్యూజెర్సీ, న్యూయార్క్లలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. పలువురు తెలుగువారు కూడా మరణించారు. అయితే, అమెరికన్స్తో పోలీస్తే మన వారిపై కరోనా ప్రభావం తక్కువనే చెప్పాలి. సహజంగా భారతీయులకు రోగ నిరోధక శక్తి ఎక్కువ. కారం, పసుపు వంటివి తీసుకోవడం, ఆహారపు అలవాట్లు భిన్నంగా ఉండడంతో మనవారిపై ప్రభావం తక్కువే.
తెలుగు సంఘాలు ఎలా ఆదుకుంటున్నాయి?
ఉన్నత విద్య కోసం అమెరికాకు వచ్చిన వారిలో రెండున్నర లక్షల మంది తెలుగువారు ఉన్నారు. వారిలో 60శాతం మంది అపార్టుమెంట్లు, రూముల్లోను, 40శాతం మంది వర్సిటీలు, కళాశాలల వసతి గృహాలు, యూనివర్సిటీలు మూసివేశారు. దీంతో అమెరికాలో ఉన్న తానా, ఆట,నాట, నాట్స్ సహా పలు తెలుగు సంఘాలు వీరికి అండగా నిలిచాయి. ఫంక్షన్ హాల్స్ను అద్దెకు తీసుకుని అక్కడ కూడా సౌకర్యాలు కల్పిస్తున్నాయి. అమెరికాలో 10 లక్షల మంది యువత హెచ్1 వీసాపై ఉన్నారు. వీరికి ప్రభుత్వ ప్యాకేజీ అందింది.
ప్రభుత్వం ఏమేరకు ఆదుకుంది?
ఉన్నత విద్య కోసం అమెరికాకు వచ్చిన వారిలో చాలా మంది ఏదో ఒకచోట పని చేస్తున్నారు. వారు పని చేసే సంస్థ వీరి తరఫున పన్ను చెల్లించినా లేదా ఆ విద్యార్థులే పన్ను చెల్లిస్తూ ప్రభుత్వ లెక్కల్లో ఉన్న వారికి ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ఇచ్చింది. ఏడాదికి లక్షన్నర డాలర్లలోపు ఆదాయం ఉన్నవారికి ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటించింది. పెద్దవారికి 1900 డాలర్లు, 18 ఏళ్లలోపు పిల్లలకు 500 డాలర్లు ఉచితంగా ఇచ్చారు. అమెరికాలో 95శాతం పన్నులు చెల్లిస్తుంటారు. వారందరికీ సాయం అందింది.
వ్యాపారాలు ఎలా ఉన్నాయి?
భారతీయులు, తెలుగు వారు అమెరికాలో ఎక్కువగా రెస్టారెంట్లు, హోటళ్లు, కన్సల్టెన్సీలు, అతిథి గ...హాలు, మాల్స్, ఆస్పత్రులు, వివిధ రకాల వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఈ సంస్థలన్నింటికీ ఇబ్బంది ఏర్పడింది. అయితే, ఎయిర్లైన్స్ వంటి పెద్ద సంస్థలకు ప్రభుత్వం నేరుగా సాయం చేసింది. చిన్న చిన్న సంస్థలు, 500లోపు ఉద్యోగులున్న ఐటీ కంపెనీలు, కన్సల్టెన్సీలకు సర్కారు అండగా ఉంది. ఈ సంస్థల్లో పని చేసే ఉద్యోగులకు రెండున్నర నెలల వేతనాలను సున్నా వడ్డీపై రుణాల రూపంలో ఆయా సంస్థలకు ప్రభుత్వం విడుదల చేసింది. లాక్డౌన్ ఎత్తేసిన 5-6 నెలల తర్వాత ఈ డబ్బును ప్రభుత్వానికి జమ చేయాల్సి ఉంటుంది.
లాక్డౌన్ ఎప్పటి వరకు ఉంటుంది?
ప్రస్తుతం వైరస్ వ్యాప్తి తగ్గుతూ వస్తోంది. మే మొదటి వారం నుంచి మూడు దశల్లో లాక్డౌన్ ఎత్తేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. భారత వైద్యులు ప్రధానంగా ఆంధ్రులు వైద్య రంగంలో విశేష సేవలు అందిస్తున్నారు.