యూఎస్లో భారత టెకీ ఆకస్మిక మృతి.. చిక్కుల్లో ఫ్యామిలీ
ABN , First Publish Date - 2020-03-08T17:17:31+05:30 IST
అమెరికాలో భారత టెకీ ఆకస్మిక మృతితో అతని కుటుంబం చిక్కుల్లో పడింది.

పెన్సిల్వేనియా: అమెరికాలో భారత టెకీ ఆకస్మిక మృతితో అతని కుటుంబం చిక్కుల్లో పడింది. యూఎస్లో టెకీ హెచ్-1బీ వీసాపై ఉండడంతో అతని భార్యకు డిపెండెంట్ వీసా(ఆధారిత వీసా) ఉంది. ఇప్పుడు టెకీ ఆకస్మికంగా మృతి చెందడంతో యూఎస్ ఇమ్మిగ్రేషన్ చట్టాల ప్రకారం అతని భార్య, పిల్లలు దేశం విడిచిపెట్టి రావాల్సిన పరిస్థితి తలెత్తింది.
వివరాల్లోకి వెళ్తే... భారత్కు చెందిన టెకీ అంజనీ కుమార్ బచ్చలి తన భార్య మనోజ్ఞ, ఇద్దరు పిల్లలతో కలిసి పెన్సిల్వేనియాలోని చెస్టర్ స్ప్రింగ్స్లో నివాసముండేవారు. అయితే, ఫిబ్రవరి 29న అంజనీ కుమార్ హఠాన్మరణం చెందారు. కుటుంబ పోషకుడైన భర్త చనిపోవడంతో భార్య మనోజ్ఞ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. దేశం కాని దేశంలో ఇద్దరు పిల్లలతో ఆమెకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. హెచ్-1బీ వీసా కలిగిన భర్త చనిపోవడంతో మనోజ్ఞ డిపెండెంట్ వీసా(ఆధారిత వీసా) రద్దు అయ్యే అవకాశం ఉంది. అక్కడి ఇమ్మిగ్రేషన్ చట్టాల ప్రకారం దేశం విడిచిపెట్టి స్వదేశానికి వచ్చేయాల్సిందే. దీంతో తమను ఆదుకోవాలని ఆమె కోరుతోంది. భర్త మృతి తర్వాత ఎలాంటి ఆదాయం లేదని ఆమె వాపోయింది. దాంతో ఈ ఫ్యామిలీని ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రవాసులు 'గోఫండ్మీ' ద్వారా నిధులు సేకరిస్తున్నారు.
గతేడాది కూడా అమెరికాలో ఇద్దరు భారత టెకీల ఆకస్మిక మృతితో వారి భార్య, పిల్లలకు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. నవంబర్ 9, 2019లో తాంపాలో ఉండే ప్రశాంత్ పడాల్ గుండెపోటుతో చనిపోయాడు. ఆ తరువాతి నెలలో నార్త్ కరోలినాలో ఉండే చలపతి రాజు కూడా ఆకస్మికంగా మృతి చెందాడు. దీంతో ఈ ఇద్దరిపై ఆధారపడి ఉన్న వారి కుటుంబాలు తిరిగి స్వదేశానికి రావాల్సిన పరిస్థితి దాపురించింది.