కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ఇటలీలో అవస్థలు పడుతున్న భారతీయులు
ABN , First Publish Date - 2020-03-17T02:46:37+05:30 IST
కొవిడ్-19(కరోనా) ఇటలీలో వేగంగా విస్తరిస్తోంది. ఒక్క ఆదివారం రోజే ఇటలీలో 368 మంది మృత్యువాతపడగా.. వేలాది కరోనా కేసులు నమోదయ్యాయి.
రోమ్: కొవిడ్-19(కరోనా) ఇటలీలో వేగంగా విస్తరిస్తోంది. ఒక్క ఆదివారం రోజే ఇటలీలో 368 మంది మృత్యువాతపడగా.. వేలాది కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇటలీ దేశస్థులతో పాటు.. ఇటలీలో నివసిస్తున్న ఇతర దేశస్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. అత్యవసరం అయితే తప్ప ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రావద్దంటూ ప్రభుత్వం హెచ్చరించింది. మరోపక్క ఇటలీలో చిక్కుకున్న భారతీయులు అక్కడి నుంచి తిరిగి వచ్చేందుకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటలీ, సౌత్ కొరియా నుంచి వచ్చే వారు తప్పనిసరిగా కొవిడ్-19 ఫ్రీ సర్టిఫికెట్ కలిగి ఉండాలంటూ మార్చి 5న భారత ప్రభుత్వం కొత్త నిబంధనలను పెట్టింది. దీంతో ఇటలీలోని భారతీయులు కొవిడ్-19 ఫ్రీ సర్టిఫికెట్ పొందేందుకు నానా కష్టాలు పడుతున్నారు. తాము రెండు రోజుల పాటు రోమ్ ఎయిర్పోర్ట్లో వేచి ఉన్నామని.. ఆ తరువాత తమ సాంపిల్స్ను భారత్లోని పూణెకు పంపాలని, ఫలితాలు వచ్చేందుకు వారం రోజుల సమయం పడుతుందని అధికారులు చెప్పినట్టు ఇటలీలో చిక్కుకున్న భారత విద్యార్థిని వైష్ణవి సింగ్ తెలిపింది.
తమ బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు కాని.. తాము భారతదేశానికి ఎప్పుడు వెళ్లచ్చన్నది మాత్రం చెప్పలేదని ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎలిసల స్టేసీ పేర్కొంది. తాను మార్చి 11న భారత్ వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకున్నానని అయితే కొవిడ్-19 ఫ్రీ సర్టిఫికెట్ లేకపోవడంతో తనను ఎయిర్పోర్ట్లో నిలిపివేశారని తెలిపింది. ఇటలీలో ఏ ఒక్క ఆసుపత్రి కూడా కొవిడ్-19 ఫ్రీ సర్టిఫికెట్ ఇవ్వడం లేదని.. కరోనా లక్షణాలు ఉంటే తప్ప అసలు ఆసుపత్రిలోకి రానివ్వడం లేదని భారతీయులు వాపోతున్నారు. ఇటలీలోనే పరీక్షలు చేయించుకునే అవకాశం ఉన్నప్పటికి.. ముఖ్యమైన పనైతే తప్ప రోడ్డు మీద ఎవరు కనిపించినా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారన్నారు.