4 రోజులుగా దుబాయి విమానాశ్రయంలోనే ఆరుగురు భారతీయులు

ABN , First Publish Date - 2020-03-23T14:22:30+05:30 IST

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి నేపథ్యంలో పలు దేశాలు ప్రయాణాలపై ఆంక్షలు విధించడంతో చాలామంది విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోయారు.

4 రోజులుగా దుబాయి విమానాశ్రయంలోనే ఆరుగురు భారతీయులు

దుబాయి:  ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి నేపథ్యంలో పలు దేశాలు ప్రయాణాలపై ఆంక్షలు విధించడంతో చాలామంది విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోయారు. తాజాగా ఆరుగురు భారతీయులు నాలుగు రోజులుగా దుబాయి విమానాశ్రయంలోనే ఉండిపోయారు. కరోనా భయంతో విదేశాలకు విమాన సర్వీసులు నిలిపివేయడంతో ఆరుగురు ఇండియాకు రాలేని పరిస్థితి. మార్చి 18న ఈ ఆరుగురు యూరోపియన్ కంట్రీస్ నుంచి దుబాయి చేరుకున్నారు. అక్కడి నుంచి కనెక్టింగ్ విమానాల ద్వారా భారత్ వచ్చేందుకు ముందే టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు.


కానీ కరోనా విజృంభణతో భారత ప్రభుత్వం ఆ తరువాతి రోజు నుంచి యూరోప్ దేశాల నుంచి వచ్చేవారిపై నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో విమానాశ్రయ అధికారులు ఆరుగురిని భారతదేశానికి పంపించేందుకు నిరాకరించారు. దీంతో ఈ ఆరుగురు దుబాయి విమానాశ్రయంలోని టెర్మినల్ 3 వద్ద చిక్కుకుపోయారు. గత నాలుగు రోజులుగా ఎయిర్‌పోర్టులోని బెంచీలపైనే కాలం వెళ్లదీస్తున్నారు. "మూడు రాత్రులుగా విమానాశ్రయంలోని బెంచీలపైనే నిద్రపోతున్నాం. ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉండాలో అర్థం కావడంలేదని" దీపక్ గుప్తా అనే ప్రయాణికుడు వాపోయాడు. ఢిల్లీకి చెందిన దీపక్ మార్చి 18న బుడాపెస్ట్ నుంచి దుబాయి చేరుకుని నాలుగు రోజులుగా విమానాశ్రయంలోనే ఉండిపోయాడు.


మరో ప్రయాణికుడు అజ్మర్ సింగ్(కంగ్రా, హిమాచల్ ప్రదేశ్) మాట్లాడుతూ తమ పరిస్థితి చాలా ఘోరంగా ఉందన్నాడు. అసలు ఎప్పటి వరకు ఇలా ఎయిర్‌పోర్టులో ఉండాలో కూడా అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తమ కుటుంబ సభ్యులు భయాందోళనలకు గురవుతున్నారని చెప్పుకొచ్చాడు.  తాము సహాయం కోసం ఇండియన్ కాన్సులేట్‌ను ఫోన్ ద్వారా సంప్రదించడం జరిగిందని, కానీ వారి నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. దుబాయి విమానాశ్రయంలో గత నాలుగు రోజులుగా పడిగాపులు కాస్తున్న ఆరుగురు వీరే... హర్జీందర్ సింగ్, గుర్జీత్ సింగ్, జస్బీర్ సింగ్, బాల్ రాజు, అజ్మర్ సింగ్, దీపక్ గుప్తా.      

Updated Date - 2020-03-23T14:22:30+05:30 IST