సౌదీలో కరోనా విజృంభణ.. ఒక్కరోజే 355 కొత్త కేసులు
ABN , First Publish Date - 2020-04-10T14:25:55+05:30 IST
మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది.
రియాధ్: మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. ప్రస్తుతం 'కొవిడ్-19' కోరల్లో చిక్కుకుని అగ్రరాజ్యాలు సైతం చిగురుటాకులా వణికిపోతున్నాయి. గల్ఫ్లో కూడా ఈ మహమ్మారి రోజురోజుకీ తన ప్రాబల్యాన్ని పెంచుకుంటూ పోతోంది. ప్రధానంగా సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈలో దీని ప్రభావం తీవ్రంగా ఉంది. తాజాగా సౌదీలో కరోనా విజృంభిస్తోంది. గురువారం ఒక్కరోజే 355 కొత్త కేసులు నమోదు కావడం అక్కడ ఈ వైరస్ ఏ స్థాయిలో వ్యాప్తి చెందుతుందో తెలియజేస్తోంది. ఈ 335 కొత్త కేసులతో కలిపి సౌదీలో కరోనా బాధితుల సంఖ్య 3,287కి చేరిందని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే ముగ్గురు మరణించారు. దీంతో కొవిడ్-19 బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 44 అయింది. మరోవైపు 35 మంది కరోనా బాధితులు కోలుకుని వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని, దీంతో కోలుకున్న వారి సంఖ్య 666కి చేరిందని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.