సౌదీలో 21 రోజులు కర్ఫ్యూ..!
ABN , First Publish Date - 2020-03-23T16:25:37+05:30 IST
సౌదీ అరేబియాలో మహమ్మారి కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కింగ్ సల్మాన్ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు అక్కడి సర్కార్ కర్ఫ్యూ విధించింది.

రియాధ్: సౌదీ అరేబియాలో మహమ్మారి కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కింగ్ సల్మాన్ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు అక్కడి సర్కార్ కర్ఫ్యూ విధించింది. సోమవారం సాయంత్రం నుంచి ఈ కర్ఫ్యూ అములోకి వస్తుందని అధికారులు ప్రకటించారు. మార్చి 23 సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ప్రతి రోజు(21 రోజుల పాటు) కర్ఫ్యూ ఉంటుందన్నారు. ఇక ఆదివారం ఒక్కరోజే సౌదీలో ఏకంగా 119 కొత్త కేసులు నమోదు కావడం ఆ దేశంలో ఈ వైరస్ ప్రభావం ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తోంది.
కొత్తగా నమోదైన 119 కేసులతో కలిపి సౌదీలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 511కి చేరిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశ పౌరులతో పాటు ప్రవాసులు కూడా కర్ఫ్యూ సమయంలో ఇళ్లకే పరిమితం కావాలన్నారు. కాగా, ప్రభుత్వ, ప్రవేట్ రంగాల్లో ప్రధాన బాధ్యతలు నిర్వహిస్తున్న వారికి మాత్రం ఈ కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చింది.