ఎగ్జిట్, రీ-ఎంట్రీ వీసాల గడువు పెంచిన సౌదీ అరేబియా
ABN , First Publish Date - 2020-04-09T18:26:43+05:30 IST
మహమ్మారి కరోనావైరస్ దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న నేపథ్యంలో సౌదీ కింగ్ సల్మాన్ బిన్ అబ్దులాజీజ్ ఈ వైరస్ కట్టడికి ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
రియాధ్: మహమ్మారి కరోనావైరస్ దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న నేపథ్యంలో సౌదీ కింగ్ సల్మాన్ బిన్ అబ్దులాజీజ్ ఈ వైరస్ కట్టడికి ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. దేశ ప్రజలు, వలసదారుల భద్రత దృష్ట్యా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది సౌదీ సర్కార్. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 25 నుంచి మే 24వ తేదీ మధ్య గడువు ముగిసే ఎగ్జిట్, రీ-ఎంట్రీ వీసాల పరిమితిని మూడు నెలలు పెంచుతున్నట్లు కింగ్ సల్మాన్ ప్రకటించారు. దీనికోసం వలసదారులు ఎలాంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. అలాగే కమర్షియల్ ప్రొఫెషనల్స్, పారిశ్రామికవేత్తలకు కూడా ఈ పెంపు వర్తిస్తుందని సౌదీ ప్రభుత్వం ప్రకటించింది.
ఈ గడువు పరిమితి పెంపు ఆటోమేటిక్గా యాడ్ అవుతుందని... దీనికోసం ప్రత్యేకంగా కేంద్ర కార్యాలయాలను సంప్రదించాల్సిన అవసరం లేదని సౌదీ జనరల్ డైరెక్టర్ ఆఫ్ పాస్పోర్ట్స్ స్పష్టం చేసింది. ఇక సౌదీ అరేబియాలో మహమ్మారి కరోనా వైరస్ రోజురోజుకీ శరవేగంగా విస్తరిస్తోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 2,932 మంది కరోనా బాధితులు ఉండగా, 41 మంది మృత్యువాత పడ్డారు. దీంతో సౌదీ ప్రభుత్వం ఇప్పటికే కొవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు అనేక చర్యలు తీసుకుంది. ప్రజలను పూర్తిగా ఇళ్లకే పరిమితం చేసింది. స్కూల్స్, మాల్స్, పార్క్స్, మసీదులను మూసివేసింది. అలాగే ప్రజలను వ్యక్తిగత శుభ్రత, సామాజిక దూరం పాటించాలని సూచించింది.