సౌదీలో కరోనా స్వైర విహారం.. ఒక్కరోజే 4,919 కేసులు !
ABN , First Publish Date - 2020-06-18T15:58:29+05:30 IST
గల్ఫ్లో మహమ్మారి కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. అటు సౌదీ అరేబియాలో శరవేగంగా విస్తరిస్తున్న కోవిడ్-19 వల్ల ప్రతి రోజు భారీగా పాటిజివ్ కేసులు నమోదవుతున్నాయి.

రియాధ్: గల్ఫ్లో మహమ్మారి కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. అటు సౌదీ అరేబియాలో శరవేగంగా విస్తరిస్తున్న కోవిడ్-19 వల్ల ప్రతి రోజు భారీగా పాటిజివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే సౌదీలో కరోనా పాజిటివ్ కేసులు లక్ష మార్కును దాటాయి. బుధవారం కూడా 4,919 కొత్త కేసులు నమోదయినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకూ సౌదీలో ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య 1,41,234కు చేరింది. కాగా, కొత్తగా నమోదైన కేసుల్లో అధికంగా రియాధ్ (2,371), మక్కా (282), జెడ్డా (279), హుఫోఫ్ (273) తదితర ప్రాంతాల్లో నమోదయ్యాయని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.
అలాగే 2,122 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో కోవిడ్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 91,662కు చేరింది. ఇక బుధవారం సంభవించిన 39 మరణాలతో కలిపి ఆ దేశంలో ఈ మహమ్మారికి బలైనవారు 1,091 మంది అయ్యారు. కాగా, ఇటీవల సౌదీ సర్కార్ కర్ఫ్యూలో సడలింపులు ఇవ్వడం కూడా కరోనా కేసులు పెరగడానికి కారణమవుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదిలాఉంటే... ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న ఈ మహమ్మారి ఇప్పటికే 4.40 లక్షల మందిని పొట్టనబెట్టుకుంది. 84 లక్షలకు పైగా మందికి సోకింది.