టిక్టాక్ను బ్యాన్ చేయాలంటూ లాహోర్ హైకోర్టులో పిటిషన్
ABN , First Publish Date - 2020-07-15T22:08:20+05:30 IST
ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్టాక్ను బ్యాన్ చేయాలంటూ లాహోర్
![టిక్టాక్ను బ్యాన్ చేయాలంటూ లాహోర్ హైకోర్టులో పిటిషన్](https://media.andhrajyothy.com/appimg/galleries/2020071504364011/07152020163814n93.jpg)
లాహోర్: ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్టాక్ను భారత ప్రభుత్వం బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. అమెరికా, ఆస్ట్రేలియా దేశాలు కూడా టిక్టాక్ యాప్పై బ్యాన్ విధించేందుకు మొగ్గుచూపుతున్నాయి. ఇప్పుడు ఇదే జాబితాలో పాకిస్థాన్ కూడా చేరింది. పాకిస్థాన్లో టిక్టాక్ యాప్ను బ్యాన్ చేయాలన్న చర్చ మరోమారు తెరపైకి వచ్చింది. గతంలో ఓ పిటిషనర్ టిక్టాక్ను బ్యాన్ చేయాలంటూ లాహోర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్ను వెంటనే పునపరిశీలించి టిక్టాక్ యాప్పై బ్యాన్ విధించాలంటూ పాకిస్థాన్కు చెందిన న్యాయవాది నదీమ్ సర్వార్ కోర్టును కోరారు. టిక్టాక్ యాప్ వల్ల దేశంలో ఇప్పటికే పది మందికి పైగా మరణించారని న్యాయవాది నదీమ్ కోర్టుకు తెలిపారు. అంతేకాకుండా టిక్టాక్ అశ్లీల చిత్రాల వ్యాప్తికి మూలంగా మారిందన్నారు. టిక్టాక్ వల్ల ఇటీవల పాకిస్థాన్లో ఓ బాలిక అత్యాచారానికి గురైనట్టు ఆయన ప్రస్తావించారు. అశ్లీలత, అనుచితమైన కంటెంట్కు టిక్టాక్ యాప్ అడ్డాగా మారిందని.. సింగపూర్, బంగ్లాదేశ్ ప్రభుత్వాలు ఇప్పటికే యాప్ను బ్యాన్ చేసినట్టు నదీమ్ గుర్తుచేశారు. ప్రస్తుత కాలంలో టిక్టాక్ యాప్ అల్లర్లకు కారణమవుతోందని ఆయన కోర్టుకు చెప్పుకొచ్చారు. పాక్ ప్రభుత్వం ఇప్పటికే పబ్జీ గేమ్ను పాకిస్థాన్లో నిషేధించింది. పిల్లల ఆరోగ్యంపై పబ్జీ గేమ్ మానసికంగా, శారీరకంగా ప్రతికూలత చూపుతున్నట్టు పాక్ ప్రభుత్వం చెప్పింది. కాగా.. భారతీయుల భద్రతకు ముప్పు కలిగిస్తున్న చైనాకు చెందిన 59 యాప్లను ఇటీవల భారత ప్రభుత్వం బ్యాన్ చేసింది. బ్యాన్ చేసిన యాప్స్లో టిక్టాక్ కూడా ఉంది.