విదేశాల నుంచి స్వదేశానికి చేరిన 5లక్షల మంది భారతీయులు!
ABN , First Publish Date - 2020-07-04T04:53:20+05:30 IST
కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన లాక్డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను ఇండియాకు తరలించేందుకు భారత ప్రభుత్వం ‘వందే భారత్ మి
న్యూఢిల్లీ: కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన లాక్డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను ఇండియాకు తరలించేందుకు భారత ప్రభుత్వం ‘వందే భారత్ మిషన్’ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ మిషన్ మే 7న ప్రారంభం కాగా.. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 5లక్షల మంది ఇండియాకు చేరుకున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వశాఖ శుక్రవారం ప్రకటించింది. రెండు నెలల్లోపే 137 దేశాల నుంచి 5,03,990 మందిని భారత్కు తరలించినట్లు పేర్కొంది. ఇండియాకు చేరిన ఐదు లక్షల మందిలో కేరళకు చెందిన వారే సుమారు లక్ష మంది వరకు ఉన్నట్లు విదేశాంగ మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. అంతేకాకుండా ఒక్క యూఏఈ నుంచే అత్యధికంగా 57వేల మందికిపైగా ప్రవాసులు భారత్కు చేరుకున్నట్లు వివరించింది. దాదాపు 91వేల మంది నేపాల్, భూటాన్ తదితర దేశాల నుంచి రోడ్డు మార్గం ద్వారా ఇండియాకు చేరినట్లు తెలిపింది. ఇదిలా ఉంటే.. చార్టెడ్ విమానాల ద్వారా విదేశాల నుంచి ఇండియాకు చేరుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఎయిర్ ఇండియా విమానాల్లో 1.64లక్షల మంది భారతీయులు ఇండియాకు రాగా.. చార్టెడ్ విమానాల్లో 2.30లక్షల మంది భారత్కు చేరుకున్నట్లు వివరించింది.