వయోధిక పురుష రోగుల ప్లాస్మా ప్రభావవంతం!
ABN , First Publish Date - 2020-10-21T10:08:42+05:30 IST
ఆస్పత్రిలో చేరేంత తీవ్ర స్థాయిలో కరోనా ప్రభావానికి గురై.. కోలుకున్నవారి నుంచి సేకరించిన ప్లాస్మా ఇతర

వాషింగ్టన్, అక్టోబరు 20: ఆస్పత్రిలో చేరేంత తీవ్ర స్థాయిలో కరోనా ప్రభావానికి గురై.. కోలుకున్నవారి నుంచి సేకరించిన ప్లాస్మా ఇతర రోగుల చికిత్సకు మెరుగ్గా ఉపయోగపడుతుందని ఓ అధ్యయనంలో తేలింది. వీరి ప్లాస్మాలో యాంటీబాడీలు అధిక స్థాయిలో ఉండటమే దీనికి కారణం. వయసు పైబడిన పురుష రోగుల ప్లాస్మా మరింత ప్రభావవంతంగా ఉంటుందని అధ్యయనం పేర్కొంది. లింగం, వయసు, వ్యాధి తీవ్రత ఆధారంగా ఎవరిలో నాణ్యమైన, అధిక మోతాదు యాంటీబాడీలు ఉంటాయో విశ్లేషించింది. 126 మంది రోగులపై సాగించిన ఈ అధ్యయనంలో యాంటీబాడీల స్థాయిల్లో చాలా వైరుధ్యం కనిపించింది. కరోనా వైరస్ స్థిరీకరణలో ఆ ప్రభావం ఉంటోందని తేలింది. కాగా, ప్లాస్మా చికిత్సపై ప్రస్తుతం పరిశోధనలు సాగుతున్నా యాంటీబాడీల శాతం ఎవరిలో ఎక్కువగా ఉంటుందనేదానిపై వైద్య వర్గాలకు స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో తాజా అధ్యయనం వారికి ఉపకరించేదే..!