ఎన్నారై మహిళకు మత్తుమందిచ్చి అఘాయిత్యం.. ఆపై వీడియో తీసి..

ABN , First Publish Date - 2020-02-08T16:00:56+05:30 IST

ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన ఎన్నారై మహిళను స్నేహం పేరుతో నమ్మించి.. ఆమె నగరానికి చేరుకున్న అనంతరం కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి అఘాయిత్యానికి పాల్పడ్డాడో కీచకుడు.

ఎన్నారై మహిళకు మత్తుమందిచ్చి అఘాయిత్యం.. ఆపై వీడియో తీసి..

ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన ఎన్నారై మహిళను స్నేహం పేరుతో నమ్మించి.. ఆమె నగరానికి చేరుకున్న అనంతరం కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి అఘాయిత్యానికి పాల్పడ్డాడో కీచకుడు. అనంతరం బాధితురాలి నగ్నదృశ్యాలను వీడియో తీసి బ్లాక్‌మెయిల్ చేస్తూ రూ. 50 లక్షల వరకు వసూలు చేశాడు. రోజురోజుకూ అతడి వేధింపులు ఎక్కువ కావడంతో తట్టుకోలేక బాధితురాలు బాచుపల్లి పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే... కర్నాటకలోని బీదర్‌కు చెందిన సంజీవ్ రెడ్డి భార్య కావేరి, మేనల్లుడు విశాల్ రెడ్డితో కలిసి నగర శివారులోని నిజాంపేటలో నివాసముంటున్నాడు.


అమెరికాలో ఉంటున్న కోకాపేటకు చెందిన ఓ మహిళతో సంజీవరెడ్డికి 2018 జూలైలో ఫేస్‌బుక్‌ద్వారా పరిచయం ఏర్పడింది. అప్పటినుంచి ఇద్దరు ఫేస్‌బుక్‌లో చాటింగ్‌ చేసుకునేవారు. ఈ పరిచయం కాస్తా ఫేస్‌బుక్ నుంచి ఫోన్‌లో మాట్లాడుకునే వరకూ వెళ్లింది. ఈ క్రమంలో అదే ఏడాది అక్టోబర్‌ 31న మహిళ యూఎస్ నుంచి హైదరాబాద్‌ వచ్చింది. దాంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లిన సంజీవ్ రెడ్డి ఆమెను రిసీవ్ చేసుకున్నాడు. అనంతరం ఆమెను తన చెల్లెలి ఇంటివద్ద దిగబెట్టాడు. అయితే, మహిళపై కన్నేసిన సంజీవ రెడ్డి.. ఆమె వద్ద నుంచి డబ్బులు గుంజాలని స్కెచ్ వేశాడు. నగరానికి వచ్చిన రెండు రోజుల తర్వాత భోజనానికి రావాల్సిందిగా మహిళను ఆహ్వానించాడు. దీంతో ఆమె కూకట్‌పల్లిలోని ఓ హోటల్‌కు వచ్చింది. అక్కడ సంజీవరెడ్డి తన భార్య కావేరి, మేనల్లుడు విశాల్‌రెడ్డిలను పరిచయం చేశాడు. కానీ, ఆమె భోజనం చేసేందుకు నిరాకరించింది. దాంతో సంజీవ్ తన ప్లాన్ ప్రకారం కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి మహిళకు ఇచ్చాడు. కూల్‌డ్రింక్‌ తాగిన మహిళ కొద్దిసేపటి తర్వాత స్పృహ కోల్పోయింది.


మహిళ మత్తులోకి జారుకున్న అనంతరం ముగ్గురూ కలిసి ఆమెను కారులో తమ ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ బాధితురాలిపై సంజీవ్ రెడ్డి అఘాయిత్యానికి పాల్పడగా.. భార్య కావేరి ఆ దృశ్యాలను వీడియో తీసింది. ఆ వీడియోను అడ్డం పెట్టుకొని సంజీవ్ రెడ్డి బ్లాక్‌మెయిల్ చేయడం మొదలెట్టాడు. అడిగనంత డబ్బు ఇవ్వకపోతే వీడియో, ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరింపులకు దిగాడు. ఇలా గత ఏడాది కాలంగా బాధితురాలి నుంచి పలు దఫాల్లో 30 తులాల బంగారం, 5వేల అమెరికన్ డాలర్లను బలవంతంగా లాక్కున్నారు. ఇప్పటి వరకు ఆమెను బెదిరిస్తూ సుమారు రూ.50 లక్షలు వరకు దండుకున్నారు. సంజీవ్ వేధింపులు రోజురోజుకూ ఎక్కువ కావడంతో తట్టుకోలేక ఆమె బాచుపల్లి పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు... నిందితులైన సంజీవ్ రెడ్డి, భార్య కావేరి, మేనల్లుడు విశాల్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

Updated Date - 2020-02-08T16:00:56+05:30 IST