సెల్ఫ్ ఐసోలేషన్లో తల్లీ, కొడుకు.. శబ్దం చేయద్దంటూ పక్కింటోళ్లు..
ABN , First Publish Date - 2020-04-05T07:13:18+05:30 IST
కొవిడ్-19 కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంటి నుంచి బయటకు రాకూడదంటూ ప్రభుత్వం హెచ్చరించడంతో

బిర్మింగమ్: కొవిడ్-19 కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంటి నుంచి బయటకు రాకూడదంటూ ప్రభుత్వం హెచ్చరించడంతో ఆటలు, పాటలు అన్నీ ఇంటి లోపలే జరుగుతున్నాయి. దీనివల్ల పక్కింటి వాళ్లకు కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తాజాగా ఇంగ్లాండ్లోని బిర్మింగమ్కు చెందిన లారెన్ అనే యువతి ఇంటికి ఓ లెటర్ వచ్చింది. ఆ లెటర్ పక్కింటి వాళ్ల నుంచే వచ్చింది. ఆ లెటర్లో ఏం రాశారంటే..‘మీకు చిన్న వయసున్న కొడుకు ఉన్నట్టు ఉన్నాడు. మీరు చాలా శబ్దం చేస్తున్నారు. ముఖ్యంగా తెల్లవారుజామున మీ వల్ల మాకు చాలా ఇబ్బంది కలుగుతోంది. మీ చప్పుళ్లకు నిద్ర లేవాల్సి వస్తోంది. కొంచెం నిశబ్దంగా ఉండండి’ అని రాశారు. ఒకపక్క లాక్డౌన్ ఉంటే.. మరోపక్క లారెన్ ఆస్తమాతో బాధపడుతుండటంతో ఇంటి నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి. దీంతో లారెన్ తన తల్లి దగ్గరకు వెళ్లి కొడుకును అల్లరి చేయకుండా ఎలా ఆపాలంటూ ఆవేదనతో అడిగింది.
అనంతరం పక్కింటి వాళ్లకు తన రెండేళ్ల కొడుకు పేరుతో లెటర్ రాసింది. లారెన్ ఏం రాసుకొచ్చిందంటే.. ‘ప్రస్తుత పరిస్థితుల కారణంగా నేను నర్సరీకి వెళ్లి అక్కడ ఆడుకోలేను. మరోపక్క మా అమ్మ ఆరోగ్యం బాగోలేదని, కొద్ది రోజుల పాటు బయటకు వెళ్లకూడదని చెప్పింది. ఇంట్లో నేను బాధ పడతానని.. మా అమ్మ నన్ను ఆనందంగా ఉంచాలని చూస్తోంది. నాకు ఇష్టమైన బొమ్మలతో నాతో కలిసి రోజంతా ఆడుతోంది. మీకు ఇది కష్టంగా అనిపించవచ్చు. కానీ నేను మా అమ్మను ఆనందంగా ఉంచాలని అనుకుంటున్నాను’ అని రాసి పక్కింటి వాళ్లకు పంపింది.
