కొవిడ్-19: అమెరికాలో లక్షా 40 వేలకు పైగా మరణాలు
ABN , First Publish Date - 2020-07-20T06:54:10+05:30 IST
అమెరికాను కరోనా మహమ్మారి వణికిస్తోంది. నిత్యం 70 వేలకు పైగా కేసులు నమోదవుతుండటంతో
![కొవిడ్-19: అమెరికాలో లక్షా 40 వేలకు పైగా మరణాలు](https://media.andhrajyothy.com/appimg/galleries/2020072001221035/07202020012404n24.jpg)
వాషింగ్టన్: అమెరికాను కరోనా మహమ్మారి వణికిస్తోంది. నిత్యం 70 వేలకు పైగా కేసులు నమోదవుతుండటంతో ముందు ముందు పరిస్థితులు ఏ విధంగా ఉంటాయోనని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ లెక్కల ప్రకారం అమెరికాలో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య ఆదివారం మధ్యాహ్నానికి(అమెరికా సమయం ప్రకారం) లక్షా 40 వేలు దాటింది. శనివారం రాత్రి నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు అమెరికా వ్యాప్తంగా 24,800 కరోనా కేసులు నమోదవగా.. 136 మంది మరణించారు. కొత్తగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 37,36,213గా ఉంది. అమెరికాలోని కాలిఫోర్నియా, ఫ్లోరిడా, టెక్సాస్ రాష్ట్రాలు కరోనాకు కేంద్రాలుగా మారిపోయాయి. ఈ రాష్ట్రాల్లో నిత్యం పదివేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. అమెరికా వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే ఐసీయూ బెడ్లు దాదాపు ఫుల్ అయిపోయాయి. అనేక ఆసుపత్రుల్లో ఎమర్జెన్సీ రూమ్స్లలో చికిత్స అందించాల్సి పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ఫేస్మాస్క్ ధరించడాన్ని తప్పనిసరి చేయాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికి తాను అటువంటి ఆదేశాలివ్వబోనని, ఫేస్మాస్క్ ధరించాలా వద్దా అన్నది వ్యక్తిగత నిర్ణయమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పుకొచ్చారు. కేసులు భారీగా పెరగడంతో ఇప్పటికే అనేక రాష్ట్రాలు లాక్డౌన్ ఆంక్షలను విధించాయి. కాగా.. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు అమెరికాలోనే నమోదయ్యాయి.