గాళ్‌ఫ్రెండ్‌ గొంతు కోసి.. 45 నిమిషాల పాటు.. దుబాయిలో..

ABN , First Publish Date - 2020-03-16T22:10:43+05:30 IST

గాళ్‌ఫ్రెండ్‌ వేరే అబ్బాయిలతో చనువుగా ఉంటోందని బాయ్‌ఫ్రెండ్ ఆమె గొంతు కోసి హతమార్చాడు. దుబాయిలో ఈ సంఘటన చోటుచేసుకుంది.

గాళ్‌ఫ్రెండ్‌ గొంతు కోసి.. 45 నిమిషాల పాటు.. దుబాయిలో..

దుబాయి: గాళ్‌ఫ్రెండ్‌ వేరే అబ్బాయిలతో చనువుగా ఉంటోందని బాయ్‌ఫ్రెండ్ ఆమె గొంతు కోసి హతమార్చాడు. దుబాయిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నిందితుడు, అతడి గాళ్ ఫ్రెండ్ ఐదేళ్ల నుంచి ప్రేమలో ఉన్నారు. వీరిద్దరూ భారతదేశానికి చెందినవారు. కొద్ది రోజుల నుంచి ఆమె వేరే అబ్బాయిలతో చనువుగా ఉంటోందని నిందితుడు అనుమానించాడు. వేరే అబ్బాయిలతో మాట్లాడితే ఊరుకోనంటూ ఆమెను బెదిరించడం మొదలుపెట్టాడు. ఇలా వారిద్దరి మధ్య ఘర్షణ వాతావరణం మొదలైంది. ఒకరోజు ఇద్దరూ కారులో వెళ్తున్న సమయంలో.. నిందితుడికి, ఆమెకు మధ్య ఘర్షణ జరిగింది. సరిగ్గా పార్కింగ్‌లో కారు పెట్టిన సమయంలో.. నిందితుడు కత్తి తీసి యువతి గొంతు కోసి హత్యచేశాడు. మృతదేహాన్ని ముందు సీట్లోనే కూర్చోబెట్టి 45 నిమిషాలపాటు దుబాయి నగరం మొత్తం తిరిగాడు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. నిందితుడు చెప్పిన మాటలకు పోలీసుల నోట మాట రాలేదు. వెంటనే అతడిని అరెస్ట్ చేసి పలు కేసులు నమోదు చేశారు. యువతిని హత్య చేసే కొద్ది రోజుల ముందు ఆమె తల్లిదండ్రులకు కూడా నిందితుడు మెయిల్ పంపినట్టు పోలీసులు తెలిపారు. యువతి అబ్బాయిలతో మాట్లాడటం ఆపకపోతే.. తానే ఆమెను హత్య చేస్తానంటూ మెయిల్‌ చేసినట్టు నిందితుడు పోలీసులకు వివరించాడు. 

Updated Date - 2020-03-16T22:10:43+05:30 IST