గుండెనొప్పితో మరణించిన సూపర్ మార్కెట్ మేనేజర్.. కస్టమర్లకు తెలియకూడదని..
ABN , First Publish Date - 2020-08-21T04:57:20+05:30 IST
బ్రెజిల్లోని ఓ రిటైల్ స్టోర్లో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది

బ్రసిలియా: బ్రెజిల్లోని ఓ రిటైల్ స్టోర్లో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. స్టోర్ మేనేజర్ గుండెనొప్పితో మరణించగా.. స్టోర్ను మూసివేయకుండా యాజమాన్యం మేనేజర్ మృతదేహాన్ని స్టోర్లోనే దాచింది. రెసిఫె సిటీలోని క్యారెఫోర్ రిటైల్ స్టోర్లో ఆగస్టు 14వ తేదీన ఈ సంఘటన చోటుచేసుకుంది. మేనేజర్ పడి ఉన్న ప్రదేశాన్ని గొడుగులు, బాక్సులతో కస్టమర్లకు కనిపించకుండా స్టోర్ యాజమాన్యం దాచింది. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. నెటిజన్లు స్టోర్ యాజమాన్యంపై మండిపడుతున్నారు. బ్రెజిల్లో కరోనా విపరీతంగా వ్యాప్తి చెందుతోంటే.. స్టోర్ యాజమన్యం ఈ విధంగా ప్రవర్తించడం సరికాదని నెటిజన్లు చెబుతున్నారు. ఇక ఈ ఘటనపై స్టోర్ యాజమాన్యం స్పందిస్తూ.. మృతదేహాన్ని ముట్టుకోకూడదన్న ప్రభుత్వ నిబంధనలను తాము పాటించినట్టు చెప్పుకొచ్చింది. తమకు ఆ సమయంలో మృతదేహాన్ని ఏ విధంగా తరలించాలో తోచలేదని సంస్థ పేర్కొంది. ఆ సమయంలో తాము వేరే విధంగా స్పందించి ఉండాల్సిందని సంస్థ క్షమాపణలు తెలిపింది. మరోపక్క మేనేజర్ కుటుంబానికి కూడా సంస్థ క్షమాపణలు చెబుతూ.. వారికి కావాల్సిన సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చింది.