లద్దాఖ్‌ దురాక్రమణ రూపశిల్పి జిన్‌పింగే

ABN , First Publish Date - 2020-09-14T14:01:36+05:30 IST

లద్దాఖ్‌ తూర్పు ప్రాంతంలో దురాక్రమణకు చైనా తీవ్ర ప్రయత్నాలు సాగించడానికి కారకుడు సాక్షాత్తూ ఆ దేశాధినేత జీ జిన్‌పింగేనని ప్రముఖ అమెరిక

లద్దాఖ్‌ దురాక్రమణ రూపశిల్పి జిన్‌పింగే

భారత వీరోచిత పోరాట పటిమ వల్ల ఫ్లాప్‌

గల్వాన్‌లో 43 మంది పీఎల్‌ఏ జవాన్ల మృతి

అమెరికా పత్రిక న్యూస్‌వీక్‌ సంచలన కథనం


వాషింగ్టన్‌, సెప్టెంబరు 13: లద్దాఖ్‌ తూర్పు ప్రాంతంలో   దురాక్రమణకు చైనా తీవ్ర ప్రయత్నాలు సాగించడానికి కారకుడు సాక్షాత్తూ ఆ దేశాధినేత జీ జిన్‌పింగేనని ప్రముఖ అమెరికన్‌ మేగజైన్‌ ‘న్యూస్‌వీక్‌’ ఓ సంచలనాత్మకమైన కథనంలో పేర్కొంది. ‘‘తన భవిష్యత్‌ను పణంగా ఒడ్డి ఆయన ఈ ఆకస్మిక దండయాత్రకు రూపకల్పన చేశారు. పీఎల్‌ఏను ముందుకు తోశారు. భారత దళాల భీకరమైన ఎదురుదాడి వల్ల ఇది కాస్తా ఫ్లాప్‌ అయింది’’ అని వ్యాఖ్యానించింది.


‘‘ఈ వైఫల్యం ఆయనకు ఓ కొత్త అవకాశం ఇచ్చింది. ఇప్పటికే దేశమంతటా కమ్యూనిస్ట్‌ పార్టీ వ్యతిరేకుల్ని చిత్రహింసల పాల్జేస్తూ- లక్షల సంఖ్యలో ప్రజలను కాన్‌సన్‌ట్రేషన్‌ క్యాంపుల్లో పెట్టి తన విధానాలకు అనుగుణంగా మలుస్తున్నారు. ఇపుడు సెంట్రల్‌ మిలటరీ కమిషన్‌ ఛైర్మన్‌ హోదాలో ఆయన పీఎల్‌ఏలో తనకు వ్యతిరేకంగా ఉన్నవారందరినీ ఏరేసి విధేయులను నియమిస్తారు. అంతేకాదు.. మున్ముందు భారత్‌పై మరిన్ని దాడులకు ప్రయత్నించవచ్చు’’ అని అంచనా వేసింది.


‘‘గల్వాన్‌ లోయలో జరిగిన ఘర్షణల్లో 20 మంది సైనికులు మరణించినట్లు భారత్‌ ప్రకటించింది. చైనా జవాన్లు 43 మంది మృతి చెంది ఉంటారని అంచనా. ఓ అభిప్రాయం ప్రకారం చైనా మృతుల సంఖ్య 60కి పైనే! ఇది ఓ రకంగా ఘోర పరాభవం. అందుకే ఒప్పుకోవడం లేదు, చెప్పుకోవడం లేదు’’ అని పేర్కొంది.


‘‘భారత దళాలు అనూహ్యంగా (పాంగాంగ్‌ సరస్సు) దక్షిణ ప్రాంత మిట్టలపై పాగా వెయ్యడం చైనాను ఓ రకంగా నివ్వెర పరిచింది. తదనంతరం చైనా ఎన్ని చర్యలు తీసుకున్నా అవి నిష్ఫలమే అయ్యాయి’’ అని న్యూస్‌వీక్‌ కథనం పేర్కొంది. ‘‘మునుపటి కంటే భారత దళాలు దూకుడుగా వ్యవహరించడమే కాక- సాహసోపేతంగా వెళుతున్నాయి. వారిలో ఓ కొత్తరకమైన తెగింపు కనబడుతోంది’’ అని వ్యాఖ్యానించింది. 


Updated Date - 2020-09-14T14:01:36+05:30 IST