అమరావతి ఉద్యమానికి మద్దతు తెలిపిన ప్రవాసాంధ్రులు

ABN , First Publish Date - 2020-12-19T21:25:39+05:30 IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా గత ప్రభుత్వం అమరావతిని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అయితే జగన్ ప్రభుత్వం మాత్రం రాష్ట్ర రాజధానిని అమరావతి నుంచి తరలించేందుకు ప్రయత్నాలు చే

అమరావతి ఉద్యమానికి మద్దతు తెలిపిన ప్రవాసాంధ్రులు

కువైట్ సిటీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా గత ప్రభుత్వం అమరావతిని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అయితే జగన్ ప్రభుత్వం మాత్రం రాష్ట్ర రాజధానిని అమరావతి నుంచి తరలించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. సీఎం జగన్ ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ రాష్ట్ర రాజధాని కోసం భూములిచ్చిన అమరావతి ప్రాంత రైతులు గత కొంత కాలంగా పోరాటం చేస్తున్నారు. వారు చేస్తున్న పోరాటం 367 రోజులకు చేరింది. ఈ క్రమంలో రైతులు చేస్తున్న ఉద్యమానికి కువైట్ తెలుగుదేశం మద్దతు ప్రకటించింది. కువైట్‌లోని తెలుగుదేశం నేతలు ఓ శుక్రవారం రోజు ఓ కార్యక్రమంలో పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వైసీపీ ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకు రైతుల పోరాటం ఆగదన్నారు. వారికి ప్రవాసాంధ్రులు అండగా ఉంటారని స్పష్టం చేశారు.



రాష్ట్రానికి సంపద సృష్టించే రాజధానిని నిర్మించేందుకు చంద్రబాబు కృషి చేశారన్నారు. పక్క రాష్ట్రాల రాజధానులను మించి ఉండే విధంగా అమరావతి నిర్మాణాన్ని చేపట్టినట్టు తెలిపారు. రాష్ట్ర రాజధానిగా అమరావతికి మద్దతు తెలిపిన జగన్.. సీఎం అయ్యాక మాట మార్చారని విమర్శించారు. రాజధాని కోసం 29 గ్రామాల రైతులు 33,000 ఎకరాలను త్యాగం చేసినట్టు గుర్తు చేశారు. వారి త్యాగాలను జగన్ అపహాస్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకుని రైతులకు న్యాయం చేస్తుందనే నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పీఆర్వోలు మద్దిన ఈశ్వర్ నాయుడు, బాలరెడ్డయ్య, వెల్ఫేర్ కోఆర్డినేటర్ నాగార్జున, ప్రోగ్రాం కన్వీర్ ప్రసాద్, మైనార్టీ అధ్యక్షుడు చాన్బాషా తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-19T21:25:39+05:30 IST