జో బైడెన్ కీలక ప్రకటన.. అమెరికాలో మళ్లీ..!
ABN , First Publish Date - 2020-08-22T21:40:43+05:30 IST
అమెరికాలో అధ్యక్ష పదవికి ఎన్నికల సమయం దగ్గరపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్.. అవసరం అయితే అమెరికా
వాషింగ్టన్: అమెరికాలో అధ్యక్ష పదవికి ఎన్నికల సమయం దగ్గరపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ కీలక ప్రకటన చేశారు. ఒకవేళ ఎన్నికల్లో గెలిచి, అధికార బాధ్యతలు స్వీకరిస్తే.. అమెరికాలో కరోనా కట్టడికి తీసుకోబోయే చర్యలను ఆయన వివరించారు. అంతేకాకుండా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై ఆయన ధ్వజమెత్తారు. వివరాల్లోకి వెళితే.. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్.. తాజాగా ఓ టీవీ చానెల్కు ఇంటర్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. నవంబర్ 3న జరిగే ఎన్నికల్లో తాను విజయం సాధించి అధికారం చేపడితే.. కరోనా మహమ్మారి నుంచి దేశ ప్రజల ప్రాణాలు రక్షించడానికి నిపుణుల సూచనలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. నిపుణుల సూచిస్తే.. అమెరికాలో మళ్లీ లాక్డౌన్ విధించేందుకు కూడా తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. కరోనాను కట్టడి చేయడంలో ట్రంప్ ఘోరంగా విఫలమయ్యారని జో బైడెన్ ఆరోపించారు. కాగా.. దేశ ఆర్థిక వ్యవస్థపై దృష్టిపెట్టిన ట్రంప్.. అమెరికాలో లాక్డౌన్ను ఎత్తేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. అమెరికాలో ఇప్పటి వరకు 55లక్షల మందికిపైగా కరోనా బారినపడ్డారు. సుమారు 1.75లక్షల మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు.