కరోనా కాటు.. ఇరాన్లో మరో ఎంపీ మృతి !
ABN , First Publish Date - 2020-03-08T14:27:40+05:30 IST
కరోనా వైరస్ ఇరాన్లో మరింత విజృంభిస్తోంది. గత నెలలో ఓ ఎంపీ మృతి చెందగా.. శనివారం మహిళా ఎంపీ ఫతేహ్ రహ్బార్(55) వైరస్ బారినపడి చనిపోయారు.

ఆ దేశంలో మరణాలు 145
ఒక్క రోజులో 21 మంది మృతి
ఇక కరోనా కాలర్ట్యూన్స్
టెహ్రాన్, బీజింగ్, మార్చి 7: కరోనా వైరస్ ఇరాన్లో మరింత విజృంభిస్తోంది. గత నెలలో ఓ ఎంపీ మృతి చెందగా.. శనివారం మహిళా ఎంపీ ఫతేహ్ రహ్బార్(55) వైరస్ బారినపడి చనిపోయారు. ఇప్పటికే దేశంలో ఏడుగురు నాయకులు, ఉన్నతాధికారులకు వైరస్ సోకింది. శనివారం ఒక్కరోజే 21 మంది మృతి చెందగా, కొత్తగా 1,076 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం మరణాల సంఖ్య 145కు చేరింది. వైరస్ జన్మస్థానమైన చైనాలో మరో 28 మంది చనిపోయారు. అయితే, గత రెండు నెలల్లో తొలిసారి కేసుల సంఖ్య రెండంకెల్లోకి (99)కి వచ్చింది. కాగా, కొవిడ్ ప్రభావిత దేశాల సంఖ్య 97కు, మృతుల సంఖ్య 3,460కు, కేసులు 1,02,180కి చేరాయి. అమెరికా కాలిఫోర్నియా తీరంలో నిలిపివేసిన గ్రాండ్ ప్రిన్సెస్ నౌకలో 21 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. భారతీయులు సహా 150 మంది ప్రయాణిస్తున్న నౌకలో 12 కరోనా కేసులు నమోదవడంతో ఈజి్ప్టలోని లగ్జర్ నగరం నైలు నదీ తీరంలో నిలిపివేశారు. అటు దక్షిణకొరియాలో కేసుల సంఖ్య 7 వేలు దాటింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ఓ భారతీయుడు కరోనా బారినపడ్డాడు.