కరోనా కాటు.. దక్షిణాఫ్రికాలో భారత సంతతి మహిళా శాస్త్రవేత్త మృతి !
ABN , First Publish Date - 2020-04-01T20:18:20+05:30 IST
ప్రపంచ ప్రఖ్యాత వైరాలజిస్ట్, భారతీయ సంతతికి చెందిన ప్రముఖ వాక్సిన్ శాస్త్రవేత్త ప్రొఫెసర్ గీతా రాంజీ(64) మహమ్మారి కరోనావైరస్తో దక్షిణాఫ్రికాలో మృతి చెందారు.

కెప్టౌన్: ప్రపంచ ప్రఖ్యాత వైరాలజిస్ట్, భారతీయ సంతతికి చెందిన ప్రముఖ వాక్సిన్ శాస్త్రవేత్త ప్రొఫెసర్ గీతా రాంజీ(64) మహమ్మారి కరోనావైరస్తో దక్షిణాఫ్రికాలో మృతి చెందారు. వారం రోజుల క్రితం ఆమె లండన్ నుంచి దక్షిణాఫ్రికా వచ్చారు. అనంతరం అనారోగ్యానికి గురికావడంతో చికిత్స కోసం ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలో ఆమె కరోనా లక్షణాలతో చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం ఆమె క్లినికల్ ట్రయల్స్ యూనిట్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్, డర్బన్లోని దక్షిణాఫ్రికా మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్(ఎస్ఐఎంఆర్సీ) కార్యాలయాల హెచ్ఐవీ నివారణ పరిశోధన యూనిట్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. రాంజీ మృతిపై ఎస్ఐఎంఆర్సీ అధ్యక్షుడు, సీఈఓ గ్లెండా గ్రే విచారం వ్యక్తం చేశారు. ఆమె మరణం ఎస్ఐఎంఆర్సీకి తీరని లోటు అని పేర్కొన్నారు. కాగా, 2018లో గీతా రాంజీ లిస్బన్లో యూరోపియన్ డెవలప్మెంట్ క్లినికల్ ట్రయల్స్ పార్ట్నర్షిప్స్(ఈడీసీటీపీ) నుంచి అత్యుత్తమ మహిళా శాస్త్రవేత్త అవార్డు అందుకున్నారు.