ఎన్నారై జంట వెరైటీ పెళ్లి.. అతిథులకు కొత్త అనుభూతి!

ABN , First Publish Date - 2020-10-07T16:31:39+05:30 IST

యూకేలో ఓ ఎన్నారై జంట పెళ్లి.. దానికి హాజరైన అతిథులకు ఒక కొత్త అనుభూతిని మిగిల్చింది. ఎందుకంటే ఈ జంట పరిణయమాడిన విధానం కూసింత వెరైటీ కావడమే.

ఎన్నారై జంట వెరైటీ పెళ్లి.. అతిథులకు కొత్త అనుభూతి!

లండన్: యూకేలో ఓ ఎన్నారై జంట పెళ్లి.. దానికి హాజరైన అతిథులకు ఒక కొత్త అనుభూతిని మిగిల్చింది. ఎందుకంటే ఈ జంట పరిణయమాడిన విధానం కూసింత వెరైటీ కావడమే. మనకు తెలిసిన 'డ్రైవ్ ఇన్ సినిమా' స్టైల్‌లోనే ఈ జంట కూడా 'డ్రైవ్ ఇన్ మ్యారేజ్' చేసుకుంది. అవును మీరు విన్నది నిజమే. ఈ ఎన్నారై జంట పెళ్లికి వచ్చిన అతిథులందరూ కాళ్లు కింద పెట్టకుండా తమ వాహనాల నుంచే పెళ్లిని తిలకించారు. చివరకు స్నాక్స్, భోజనాలు కూడా వారి వాహనాల వద్దకే అందించే ఏర్పాటు చేశారు పెళ్లివారు. 


యూకేకు చెందిన భారత సంతతి జంట రోమా పోపట్, వీనల్ పటేల్ ఇలా వెరీ వెరీ స్పెషల్ వెడ్డింగ్‌తో ఒకటయ్యారు. అయితే, దీనికి కారణం అక్కడి కొవిడ్ నిబంధనలు. ప్రస్తుతం ఇంగ్లండ్‌లో పెళ్లి ఫంక్షన్లకు 15 మందికి మించి హాజరు కావొద్దనే నిబంధన ఉంది. అందుకే రోమా దంపతులు కూసింత వెరైటీగా ఆలోచించారు. తమ పెళ్లికి భారీ సంఖ్యలో అతిథులు హాజరు కావాలి... అదే సమయంలో యూకే విధించిన కొవిడ్ నిబంధన అమలు కావాలి. దీంతో ఈ జంటకు వచ్చిన ఐడియా 'డ్రైవ్ ఇన్ మ్యారేజ్'. తమకు వచ్చిన ఐడియాను వధువరులిద్దరూ కుటుంబ సభ్యులకు చెప్పారు. 


ఇంకేముంది వెంటనే దీనికోసం ఇరు కుటుంబాలు చకచకా అన్ని ఏర్పాట్లు చేశాయి. బ్రాక్టెడ్ పార్క్‌లో 500 ఎకరాల విస్తీర్ణం గల మైదానంలో శుక్రవారం ఈ వివాహం జరిగింది. దీనికి హాజరైన సుమారు 250 మంది అతిథులు తమ కార్లలో కూర్చొనే పెళ్లిని తిలకించారు. అతిథుల కోసం ఓ పెద్ద తెరను ఏర్పాటు చేశారు.


హిందూ సంప్రదాయం ప్రకారం 4 గంటల పాటు ఈ వివాహం జరిగింది. పెళ్లి తంతు ముగిసిన తర్వాత ఈ కొత్త జంట గోల్ఫ్ బగ్గీలో తిరుగుతూ అతిథులను పలకరించారు. వధువు రోమా మాట్లాడుతూ... "మాకు ఇది చాలా అద్భుతమైన రోజు. ఇలా డ్రైవ్ ఇన్ మ్యారేజ్ చేసుకోవడం చాలా కొత్త అనుభూతిని ఇచ్చింది. పెళ్లికి వచ్చిన అతిథులకు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఎప్పటికీ ఈ రోజు గుర్తుండీ పోతుంది" అని అన్నారు.  

Updated Date - 2020-10-07T16:31:39+05:30 IST