న్యూయార్క్లో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు భారతీయులు దుర్మరణం
ABN , First Publish Date - 2020-08-07T18:08:57+05:30 IST
అమెరికాలోని న్యూయార్క్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో భారత సంతతి మహిళ, ఆమె ఇద్దరు పిల్లలు దుర్మరణం పాలయ్యారు.
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో భారత సంతతి మహిళ, ఆమె ఇద్దరు పిల్లలు దుర్మరణం పాలయ్యారు. మరో ఐదుగురు కుటుంబ సభ్యులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. న్యూయార్క్ స్టేట్ హైవేపై సోమవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులను జూలిక గయాపర్సద్(47), కూతురు చెల్సీయా(14), కుమారుడు జస్టిన్(10)గా గుర్తించారు. న్యూయార్క్లోని బ్రోంక్స్లో నివాసముండే గయాపర్సద్ కుటుంబం రెండు కార్లలో ట్రినిడాడ్, గయానా వెళ్లి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
మొదటి కారును వేగంగా వచ్చిన మరో వాహనం బలంగా ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న జూలిక గయాపర్సద్, చెల్సీయా, జస్టిన్ అక్కడికక్కడే చనిపోయారు. జూలిక రెండో కుమారుడు అమీర్ జగదీయోకు గాయాలయ్యాయి. అలాగే రెండో కారు కూడా జూలిక కారు వెనకే ఉండడంతో అది కూడా పల్టీలు కొట్టింది. దాంతో అందులో ప్రయాణిస్తున్న మహేశ్వర్నాథ్ కరణ్, నేత సింగ్, సలీనా సింగ్కు గాయాలపాలయ్యారు. గాయపడిన వీరిని చికిత్స కోసం బ్లూమింగ్టన్ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.