భారత వ్యక్తిని కాల్చి చంపిన దుండగుడు.. అమెరికాలో..
ABN , First Publish Date - 2020-02-25T21:41:51+05:30 IST
గుర్తు తెలియని ఓ దుండగుడు భారత వ్యక్తిని కాల్చి చంపిన దారుణ ఘటన అమెరికాలోని లాస్ ఏంజిల్స్లో చోటు చేసుకుంది.
లాస్ ఏంజిల్స్: గుర్తు తెలియని ఓ దుండగుడు భారత వ్యక్తిని కాల్చి చంపిన దారుణ ఘటన అమెరికాలోని లాస్ ఏంజిల్స్లో చోటు చేసుకుంది. లాస్ ఏంజిల్స్లోని విట్టర్ ప్రాంతంలో గల సెవెన్-ఎలెవన్ అనే స్టోర్లో పని చేసే మణిందర్ సింగ్ సాహి అనే వ్యక్తిని ముఖానికి మాస్క్ వేసుకొని వచ్చిన ఓ దుండగుడు తుపాకీతో కాల్చి పరారయ్యాడు. ఈ ఘటన శనివారం జరిగింది. గన్తో స్టోర్లోకి ప్రవేశించిన దుండగుడు.. సాహిని బెదిరించి కౌంటర్లోని నగదు తీసుకున్నాడు. అనంతరం అక్కడి నుంచి తిరిగి వెళ్లే క్రమంలో సాహిపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో సాహి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ దృశ్యాల ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
కాగా, హర్యానాలోని కర్నాల్కు చెందిన సాహి ఆరు నెలల క్రితమే ఉపాధి కోసం అమెరికా వెళ్లినట్టు అతని బంధువులు తెలిపారు. సాహికి భార్య రూపింద్ కౌర్, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక్కడ సంపాదించిన డబ్బులను ప్రతి నెలా స్వదేశంలో ఉన్న భార్య పిల్లలకు పంపించేవాడని వారు తెలిపారు. సాహి మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు యూఎస్లోని అతని బంధువులు 'గోఫండ్మీ' పేజ్ క్రియేట్ చేసి విరాళాలు సేకరిస్తున్నారు. ఆదివారం ఉదయం ఈ పేజ్ క్రియేట్ చేయగా సాయంత్రం వరకు 18వేల డాలర్లు(రూ.12,93,975) పోగు అయ్యాయి.