యూఏఈలో ఫ్రంట్లైన్ ఉద్యోగులను సన్మానించిన భారత కాన్సులేట్ !
ABN , First Publish Date - 2020-06-26T16:21:34+05:30 IST
కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలను పణంగా పెట్టి మహమ్మారి బాధితులను సేవలందించిన ఫ్రంట్లైన్ ఉద్యోగులను యూఏలోని భారత కాన్సులేట్ సన్మానించింది.
![యూఏఈలో ఫ్రంట్లైన్ ఉద్యోగులను సన్మానించిన భారత కాన్సులేట్ !](https://media.andhrajyothy.com/appimg/galleries/2020062610495741/06262020105110n63.jpg)
యూఏఈ: కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలను పణంగా పెట్టి మహమ్మారి బాధితులను సేవలందించిన ఫ్రంట్లైన్ ఉద్యోగులను యూఏలోని భారత కాన్సులేట్ సన్మానించింది. వారి సేవలను కొనియాడుతూ ప్రత్యేక ప్రశంస పత్రాలను అందజేసింది. ఈ సందర్భంగా సుమారు వంద మంది మెడికల్ ప్రొఫెషనల్స్, వాలంటీర్లతో పాటు ప్రభుత్వ సంస్థలు, సహాయక సంస్థలను భారత కాన్సులేట్ జనరల్ సన్మానించారు.
"ఈ విపత్కర పరిస్థితుల్లో ఫ్రంట్లైన్ ఉద్యోగులు చూపించిన తెగువ అమోఘం. ఫ్రంట్లైన్ కార్మికులు, వాలంటీర్లు నిజమైన నిస్వార్థతను చూపించారు. సామాజిక స్పృహాతో వారు చేసిన సేవ ఎప్పటికీ మరిచిపోలేనిది. ఈ మహమ్మారిపై విజయం సాధించడంలో వారు తమ ప్రాణాలను అడ్డుపెట్టి మరి పోరాడారు" అని దుబాయిలోని భారత కాన్సుల్ జనరల్ విపుల్ అన్నారు.
"దుబాయ్ హెల్త్ అథారిటీ, దుబాయ్ అంబులెన్స్, దుబాయ్ పోలీస్, ఆస్టర్ డీఎం హెల్త్కేర్, ఇండియన్ కమ్యూనిటీ, మహమ్మారిపై విజయం సాధించడంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము" అని అన్నారు.
ఈ సందర్భంగా ఆస్టర్ డీఎం హెల్త్కేర్ వ్యవస్థాపక చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఆజాద్ మూపెన్ మాట్లాడుతూ "ఈ సదుపాయాన్ని కల్పించడంలో చాలా మంది వైద్య సిబ్బంది, వాలంటీర్లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ఈ ప్రాజెక్టులో చురుకుగా పాల్గొన్నారు. వారి వ్యక్తిగత భద్రతను కూడా పక్కనపెట్టి... వారు ప్రతిరోజూ ఎక్కువ గంటలు నిరంతరాయంగా పని చేశారు. కోవిడ్-19 వ్యాప్తిని నియంత్రించడానికి అవసరమైన అన్ని చర్యలను అనుసరించి వారి వద్దకు వచ్చిన ప్రతి రోగికి వైద్యసేవలు అందించారు. దాని ఫలితమే ఈ అద్భుతమైన విజయం. వారు సాధించిన విజయం పట్ల మేము ఎంతో గర్విస్తున్నాము, అభినందిస్తున్నాము" అని అన్నారు.