58 ఏళ్ల తర్వాత తిరిగి స్వదేశానికి చేరుకున్న ప్రవాస భారతీయుడు

ABN , First Publish Date - 2020-11-21T17:05:52+05:30 IST

యూఏఈలో చిక్కుకున్న ప్రవాస భారతీయుడు తోటి భారతీయుల సహాయంతో 58 ఏళ్ల తర్వాత స్వదేశానికి చేరుకున్నాడు.

58 ఏళ్ల తర్వాత తిరిగి స్వదేశానికి చేరుకున్న ప్రవాస భారతీయుడు

దుబాయి: యూఏఈలో చిక్కుకున్న ప్రవాస భారతీయుడు తోటి భారతీయుల సహాయంతో 58 ఏళ్ల తర్వాత స్వదేశానికి చేరుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కేరళకు చెందిన కే. రాఘవన్(80) అనే వ్యక్తి 58 ఏళ్ల క్రితం కేరళ నుంచి చెక్క పడవలో యూఏఈకి వెళ్లాడు. అక్కడే కొంతకాలం రెండు టైలరింగ్ షాపులను నడిపాడు. అనంతరం అజ్మన్‌లో ట్రేడింగ్ కంపెనీని స్థాపించాడు. అయితే కొద్ది సంవత్సరాల క్రితం వ్యాపారం నష్టాల్లోకి వెళ్లిపోవడంతో  రాఘవన్ ఆర్థికంగా చిదిగిపోయాడు. తిరిగి స్వదేశానికి వచ్చేందుకు రెసిడెన్సీ వీసాపై ఉన్న 1,04,000 దిర్హామ్‌ల జరిమానా అడ్డుపడింది. దీంతో యూఏఈలో ఉండలేక.. స్వదేశానికి రాలేక సతమతమవుతూ వచ్చాడు. రాఘవన్ పరిస్థితిని అర్థం చేసుకున్న తోటి ప్రవాస భారతీయులు, సోషల్ వర్కర్లు ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. 


పరిస్థితిని అర్థం చేసుకున్న అధికారులు జరిమానాను 1,04,000 దిర్హామ్‌ల  నుంచి 59,000 దిర్హామ్‌లకు తగ్గించారు. 59 వేల దిర్హామ్‌ల జరిమానాను ప్రవాస భారతీయులు చెల్లించి రాఘవన్‌ భారతదేశం వచ్చేందుకు సహాయపడ్డారు. ప్రస్తుతం రాఘవన్ నడవలేని స్థితిలో ఉన్నాడు. స్వదేశానికి తిరిగి వెళ్తున్నానన్న విషయం తెలుసుకున్న రాఘవన్ ముఖంలో ఒక్కసారిగా ఆనందం కనిపించిందని ప్రవాస భారతీయులు తెలిపారు. తనకు శేషజీవితం భారత్‌లోనే గడపాలని ఉందని, మాతృభూమిలోనే తాను ప్రాణాలు విడవాలని కోరుకుంటున్నట్టు రాఘవన్ చెప్పాడు. తాను స్వదేశానికి చేరుకునేందుకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి రాఘవన్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపాడు. 

Updated Date - 2020-11-21T17:05:52+05:30 IST