టైమ్స్ ‘హీరోస్ ఆఫ్ 2020’ జాబితాలో భారత సంతతి వ్యక్తికి చోటు
ABN , First Publish Date - 2020-12-13T08:14:14+05:30 IST
టైమ్స్ మ్యాగజైన్ ‘హీరోస్ ఆఫ్ 2020’ జాబితాలో భారత సంతతి వ్యక్తికి చోటు లభించింది. అమెరికాలో కొద్ది నెలల క్రితం తెల్ల పోలీసు అధికారి చేతిలో నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మరణించిన విషయం తెలిసిందే. ఈ హత్య తరువాత అమెరికా అట్టుడుకుపోయింది. అమెరికా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.

న్యూయార్క్: టైమ్స్ మ్యాగజైన్ ‘హీరోస్ ఆఫ్ 2020’ జాబితాలో భారత సంతతి వ్యక్తికి చోటు లభించింది. అమెరికాలో కొద్ది నెలల క్రితం తెల్ల పోలీసు అధికారి చేతిలో నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మరణించిన విషయం తెలిసిందే. ఈ హత్య తరువాత అమెరికా అట్టుడుకుపోయింది. అమెరికా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. వేలాది మంది నిరసనకారులు రోడ్లపైకి వచ్చి జార్జ్ ఫ్లాయిడ్ హత్యకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వాషింగ్టన్ డీసీలో రాత్రి సమయంలోనూ నిరసనలు ఆగకపోవడంతో పోలీసులు నిరసనకారులను అరెస్ట్ చేసేందుకు బారికేడ్లను అడ్డుపెట్టి పెప్పర్ స్ప్రే జల్లడం మొదలుపెట్టారు.
నిరసనలు జరుగుతున్న సమీపంలోనే రాహుల్ డూబే అనే భారత సంతతి వ్యక్తి నివసిస్తుండటంతో పోలీసుల నుంచి నిరసనకారులను కాపాడాలని నిర్ణయించుకున్నారు.వెంటనే తన ఇంట్లోకి నిరసనకారులను ఆహ్వానించి వారికి ఫుడ్, బెడ్ ఏర్పాటు చేశారు. రాహుల్ డూబే మొత్తంగా 70 మందికి తన ఇంట్లో చోటు కల్పించారు. అవసరమైన సమయంలో అనేక మందికి చోటు కల్పించినందుకు గాను టైమ్స్ మ్యాగజైన్ హీరోస్ ఆఫ్ 2020 జాబితాలో చోటు కల్పించింది. ఆ సమయంలో ఏదైతే అవసరమో తాను అదే చేశానంటూ రాహుల్ డూబే టైమ్స్కు చెప్పుకొచ్చారు.