భారత్ మేల్కొనకుంటే కేన్సర్ సునామీ: నోరి
ABN , First Publish Date - 2020-03-08T15:10:18+05:30 IST
భారత ప్రభుత్వం మేల్కొని యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టకుంటే కేన్సర్ సునామీ దేశాన్ని ముంచెత్తే అవకాశాలు ఉన్నాయని ప్రముఖ ఇండో-అమెరికన్ వైద్యులు నోరి దత్తాత్రేయుడు (అంకాలజిస్టు), రేఖా భండారి(గేరియాట్రిక్స్ డాక్టర్) హెచ్చరించారు.

వాషింగ్టన్: భారత ప్రభుత్వం మేల్కొని యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టకుంటే కేన్సర్ సునామీ దేశాన్ని ముంచెత్తే అవకాశాలు ఉన్నాయని ప్రముఖ ఇండో-అమెరికన్ వైద్యులు నోరి దత్తాత్రేయుడు (అంకాలజిస్టు), రేఖా భండారి(గేరియాట్రిక్స్ డాక్టర్) హెచ్చరించారు. ప్రస్తుతం భారత్లో రోజూ కేన్సర్తో 1300 మంది మరణిస్తుండగా, ఏటా కొత్తగా 10.2 లక్షల మంది ఆ వ్యాధి పంజాకు చిక్కుతున్నారని వారు పేర్కొన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే 2030కల్లా.. ఏటా కేన్సర్ బారినపడే వారి సంఖ్య 10.7 లక్షలకు పెరగొచ్చన్నారు. నేషనల్ కేన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ను ప్రారంభిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాన్ని వారు కొనియాడారు.
ప్రజలకు అవగాహన కల్పించి తొలి దశలోనే వ్యాధిని గుర్తించేందుకుప్రత్యేక టోల్ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేయాలని సూచించారు. పొగాకు ఉత్పత్తుల కట్టడికి పటిష్ట చర్యలు చేపట్టాలని, ప్రాంతీయ కేన్సర్ నియంత్రణ కేంద్రాలను ప్రారంభించాలని అన్నారు. వైద్య విద్యార్థులకు కేన్సర్ నియంత్రణ చర్యలపై ప్రత్యేక పాఠాలు బోధించాలని డాక్టర్ దత్తాత్రేయుడు పేర్కొన్నారు. ప్రస్తుతం యువజనం అత్యధికంగా ఉన్న దేశంగా భారత్ ఉందని.. ఇవే గణాంకాలు కొనసాగితే వచ్చే 20 ఏళ్లలో వృద్ధులు అత్యధికంగా ఉన్న దేశంగా మారే అవకాశం ఉందని ప్రఖ్యాత గేరియాట్రిక్స్ డాక్టర్ రేఖా భండారి అన్నారు.