భారత్.. ఎంత రోతో.. అక్కడ పీల్చేగాలి కూడా..!
ABN , First Publish Date - 2020-10-24T11:36:57+05:30 IST
‘భారత్ను చూడండి.. అక్కడ పీల్చేగాలి కూడా రోత పుట్టిస్తుంది. భారతే కాదు.. చైనా, రష్యా దేశాలూ వాయుకాలుష్యమయమే..’ అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విరుచుకుపడ్డారు. ఆయా దేశాల్లో గాలి నాణ్యత అత్యంత దారుణస్థాయిలకు పడిపోయిందన్నారు. వాతావరణ మార్పుల విషయంలో ఆ మూడు దేశాలు సహకరించడం లేదని..

- అక్కడ పీల్చేగాలీ కాలుష్యమే.. చైనా, రష్యా దేశాలూ అంతే
- విరుచుకుపడ్డ అమెరికా అధ్యక్షుడు ట్రంప్
- పారిస్ ఒప్పందం నుంచి వైదొలగడానికి సమర్థన
- బైడెన్తో వాడివేడిగా తుది ముఖాముఖీ
వాషింగ్టన్, అక్టోబరు 23 : ‘భారత్ను చూడండి.. అక్కడ పీల్చేగాలి కూడా రోత పుట్టిస్తుంది. భారతే కాదు.. చైనా, రష్యా దేశాలూ వాయుకాలుష్యమయమే..’ అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విరుచుకుపడ్డారు. ఆయా దేశాల్లో గాలి నాణ్యత అత్యంత దారుణస్థాయిలకు పడిపోయిందన్నారు. వాతావరణ మార్పుల విషయంలో ఆ మూడు దేశాలు సహకరించడం లేదని ఆరోపించారు. అందుకే పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగిందంటూ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. డెమొక్రాట్ అధ్యక్ష అభ్యర్థి జోబైడెన్తో నాష్విల్లేలో గురువారం రాత్రి జరిగిన తుది ముఖాముఖీ చర్చలో ట్రంప్ భారత్ను మరోసారి లక్ష్యంగా చేసుకున్నారు. గంటన్నర పాటు ఈ చర్చ జరిగింది. ట్రంప్కు కరోనా సోకిన నేపథ్యంలో రెండో ముఖాముఖీ జరగలేదు. చికిత్స అనంతరం ట్రంప్ పా ల్గొన్న చర్చ ఇదే! ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా విజృంభణ అంశంతోనే ముఖాముఖీ ఆరంభమైంది.
ఈ అంశంపై ఇద్దరి మధ్యా వాడివేడిగా చర్చ జరిగింది. ‘కర్బన ఉద్గారాలను తగ్గించడంలో అమెరికా ఎన్నో చర్యలు తీసుకుంది. కానీ భారత్, చైనా, రష్యాల్లో పరిస్థితి ఇందుకు భిన్నం. ఆ దేశాల్లో వాయుకాలుష్యం విపరీతంగా ఉంది’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. పర్యావరణ పరిరక్షణ గురించి ఆ మూడు దేశాలు ఎంత మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ప్రపంచంలో అత్యధికంగా కర్బన ఉద్గారాలను వెలువరిస్తున్న దేశాల్లో భారత్ నాలుగో స్థానం(7%)లో ఉంది. 27శాతంతో చైనా అగ్రభాగాన ఉంది. కాగా, భారత్కు వ్యతిరేకంగా ట్రంప్ చేసిన విమర్శలపై నెటిజన్లు విపరీతంగా స్పందించారు. గత ఏడాది అమెరికాలో నిర్వహించిన ‘హౌడీ.. మోడీ’ కార్యక్రమాన్ని పలు సందర్భాల్లో ట్రంప్ ప్రస్తావిస్తూ.. మోదీ తనకు ఆప్తమిత్రుడంటూ ఆకాశానికి ఎత్తేసిన వైనాన్ని పలువురు నెటిజన్లు గుర్తుచేశారు. అయితే ట్రంప్ ఒక్కసారిగా రూటు మార్చి భారత్పై విరుచుకుపడటం అందరినీ విస్మయానికి గురిచేసింది. వచ్చే నెలలో జరిగే ఎన్నికల్లో అత్యంత కీలకంగా భావిస్తున్న భారతీయుల ఓట్లపై ట్రంప్, బైడెన్ కన్నేశారు. అనూహ్యంగా ఇటీవలి సర్వేల్లో బైడెన్కే భారతీయులు మొగ్గు చూపుతున్నట్టు వెల్లడి కావడంతో ట్రంప్ తన అక్కసునంతా వెళ్లగక్కారని విశ్లేషకులు చెబుతున్నారు.