అమెరికా- భారత్ మధ్య స్నేహం ఇప్పుడు మరింత అవసరం: ఇవాంకా ట్రంప్
ABN , First Publish Date - 2020-12-01T06:13:31+05:30 IST
అమెరికా- భారత్ మధ్య బలమైన స్నేహం ఈ సమయంలో మరింత అవసరమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె

వాషింగ్టన్: అమెరికా- భారత్ మధ్య బలమైన స్నేహం ఈ సమయంలో మరింత అవసరమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ అన్నారు. 2017 భారత్ పర్యటనకు సంబంధించిన ఫొటోలను ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. 2017 నవంబర్లో ఇవాంకా ట్రంప్ జీఈఎస్ సమావేశంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ సమావేశాన్ని నెమరువేసుకుంటూ ‘ప్రపంచం కొవిడ్-19తో పోరాడుతున్న ఈ సమయంలో ప్రపంచ భద్రత, ఆర్థిక శ్రేయస్సు, స్థిరత్వాన్ని పెంపొందించడానికై మన(అమెరికా, భారత్) దేశాల మధ్య బలమైన స్నేహం ఇంతకుముందు కంటే ఇప్పుడు ఎక్కువగా అవసరం’ అని ఇవాంకా ట్రంప్ తన పోస్టులో రాసుకొచ్చారు. కాగా.. 2017లో జీఈఎస్ సమావేశంలో పాల్గొనేందుకు ఇవాంకా ట్రంప్ ఒక్కరే భారత్కు వచ్చారు. ఈ ఏడాది మొదట్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుటుంబసమేతంగా భారత్ పర్యటనకు వచ్చారు. ఈ పర్యటనలో భాగంగా ఇవాంకా ట్రంప్, ఆమె భర్త కూడా భారత్కు వచ్చి తాజ్మహల్ను సైతం సందర్శించారు.