కరోనాపై భారత్ స్పందన భేష్: ప్రపంచ ఆరోగ్య సంస్థ
ABN , First Publish Date - 2020-07-23T02:37:22+05:30 IST
కరోనా మహమ్మారి విషయంలో భారత ప్రభుత్వం మొదటి నుంచి వేగంగా, సమర్థవంతంగా పనిచేస్తూ
![కరోనాపై భారత్ స్పందన భేష్: ప్రపంచ ఆరోగ్య సంస్థ](https://media.andhrajyothy.com/appimg/galleries/2020072209054415/07222020210709n2.jpg)
జెనీవా: కరోనా మహమ్మారి విషయంలో భారత ప్రభుత్వం మొదటి నుంచి అత్యంత వేగంగా, సమర్థవంతంగా పనిచేస్తూ వచ్చిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) అభినందించింది. కరోనా వ్యాప్తి మొదలైన సమయంలో భారత్ అసాధారణమైన నిర్ణయాలు తీసుకుందని డబ్ల్యూహెచ్ఓ రీజినల్ డైరెక్టర్ పూనమ్ ఖేత్రపాల్ సింగ్ కొనియాడారు. అంతేకాకుండా మొదటినుంచి కరోనా పరీక్షల సంఖ్యను పెంచుతూ వెళ్తోందని, పేషంట్ల కోసం ముందు జాగ్రత్తగా అనేక ఆసుపత్రులను సిద్దం చేస్తోందని ఆమె అన్నారు. మరోపక్క మెడిసిన్స్ను అవసరానికి మించి నిల్వ ఉంచుతోందని చెప్పారు. భారత్తో పాటు అనేక దేశాల్లో మార్చిలో కేసుల పెరుగుదల మొదలైందని.. అయితే భారత్ మాత్రం కేసులు, మరణాల సంఖ్య పెరగకుండా కఠిన నిర్ణయాలు తీసుకుందని పూనమ్ ఖేత్రపాల్ సింగ్ పేర్కొన్నారు. ఇప్పుడు ఆ దేశాలతో పోల్చితే భారత్ చాకచక్యంగా వ్యవహరించిందనే చెప్పాలన్నారు. భారత్లో ఇప్పటికి ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాని ప్రాంతాలు చాలానే ఉన్నాయని ఆమె చెప్పుకొచ్చారు. 130 కోట్లకు పైగా జనాభా కలిగిన దేశంలో ఇలాంటి పరిస్థితులు అసాధారణమన్నారు. ఇక భారత్తో పాటు ప్రపంచదేశాలన్ని భౌతిక దూరం పాటించడం, ప్రజల ఆరోగ్యంపై ఎక్కువగా దృష్టి సారించాలన్నారు. అదే విధంగా కరోనా బారిన పడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని, హెల్త్ కేర్ వర్కర్లను కాపాడుకోవాలని, హెల్త్ సిస్టమ్ సామర్థాన్ని కూడా పెంచుకోవడం ముఖ్యమన్నారు.