బైడెన్ టీంలో మరో భారతీయురాలికి చోటు !

ABN , First Publish Date - 2020-12-29T16:20:26+05:30 IST

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ తాజాగా‌ మరో భారతీయురాలికి తన టీంలో చోటు కల్పించారు.

బైడెన్ టీంలో మరో భారతీయురాలికి చోటు !

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ తాజాగా‌ మరో భారతీయురాలికి తన టీంలో చోటు కల్పించారు. వైట్‌‌హౌస్‌ ఆఫీస్‌ ఆఫ్‌ డిజిటల్‌ స్ట్రాటజీ భాగస్వామ్య మేనేజర్‌గా భారత సంతతి ఈషా షాను నియమించారు. కశ్మీర్‌కు చెందిన ఈషాకు ఈ కీలక బాధ్యతలు అప్పగించారు. డిజిటల్‌ స్ట్రాటజీ డైరెక్టర్‌ రాబ్‌ ప్లాహెర్టీ నేతృత్వంలో ఆమె పని చేయనున్నారు. ఇక లూసియానాలో పెరిగిన ఈషా ఇంతకుముందు బైడెన్‌-కమల ఎన్నికల ప్రచారంలో డిజిటల్‌ భాగస్వామ్య నిర్హాకురాలిగా విధులు నిర్వహించారు. ప్రస్తుతం ఆమె స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూషన్ అడ్వాన్స్‌మెంట్‌ స్పెషలిస్ట్‌గా పని చేస్తున్నారు. అంతకుముందు జాన్‌ఎఫ్‌ కెన్నడీ సెంటర్‌ ఫర్‌ పెర్ఫార్మింగ్‌ ఆర్ట్స్‌ కార్పోరేట్‌ ఫండ్‌లో అసిస్టెంట్‌ మేనేజర్‌గా, ఇంటిగ్రేటెడ్‌ మార్కెటింగ్‌ సంస్థ బ్యూరు కమ్యూనికేషన్‌ స్పెషలిస్ట్‌గానూ విధులు నిర్వహించారు.


కాగా, బైడెన్ ఎంపిక చేసిన వైట్‌హౌస్ ఆఫీస్ ఆఫ్ డిజిటల్ స్ట్రాటజీలోని ఇతర సభ్యులలో బ్రెండన్ కోహెన్ (ప్లాట్‌ఫామ్ మేనేజర్), మహా ఘండౌర్ (డిజిటల్ భాగస్వామ్య మేనేజర్), జోనాథన్ హెబర్ట్ (వీడియో డైరెక్టర్), జైమ్ లోపెజ్ (ప్లాట్‌ఫాంల డైరెక్టర్), కరాహ్నా మాగ్‌వుడ్ (క్రియేటివ్ డైరెక్టర్), అబ్బే పిట్జెర్ (డిజైనర్), ఒలివియా రైజ్నర్ (ట్రావెలింగ్ కంటెంట్ డైరెక్టర్), రెబెకా రింకెవిచ్ (డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ డిజిటల్ స్ట్రాటజీ), క్రిస్టియన్ టామ్ (డిజిటల్ స్ట్రాటజీ డిప్యూటీ డైరెక్టర్) మరియు కామెరాన్ ట్రింబుల్ (డిజిటల్ ఎంగేజ్‌మెంట్ డైరెక్టర్) ఉన్నారు. ఈ సందర్భంగా బైడెన్ మాట్లాడుతూ.. "నేను నియమించిన విభిన్న నిపుణుల బృందం డిజిటల్ రంగంలో విస్తృతమైన అనుభవాన్ని కలిగి ఉంది. ఈ టీం వైట్‌హౌస్‌ను అమెరికన్ ప్రజలకు సరికొత్త, వినూత్న మార్గాల్లో అనుసంధానించడానికి సహాయపడుతుంది. బృందంలోని సభ్యులు మన దేశాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతారనే నమ్మకం నాకుంది. అత్యున్నత నైపుణ్యం గల సభ్యులు నా టీంలో ఉండడం చాలా సంతోషం." అని అన్నారు.


ఇక ఇప్పటికే బైడెన్‌ తన బృందంలో పలువురు భారత సంతతి వ్యక్తులకు కీలక బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. కమలా హారిస్‌ను ఉపాధ్యక్షురాలిగా, నీరా టాండన్‌ను బడ్జెట్ చీఫ్‌గా, వేదాంత్ పటేల్‌లకు వైట్‌‌హౌస్ అసిస్టెంట్ ప్రెస్ సెక్రటరీగా, వినయ్‌ రెడ్డిని స్పీచ్ రైటింగ్ డైరెక్టర్‌గా నియమించారు. తాజాగా వీరి జాబితాలో ఈషా షా కూడా చేరారు. 


Updated Date - 2020-12-29T16:20:26+05:30 IST