చైనాకు చెందిన 43 మొబైల్ యాప్లపై నిషేధం
ABN , First Publish Date - 2020-11-25T09:46:43+05:30 IST
సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతూ.. యుద్ధోన్మాదంతో వనరులను సమకూర్చుకుంటున్న డ్రాగన్

- జాబితాలో అలీ ఎక్స్ప్రెస్, మ్యాంగో
- వీచాట్కు చెందిన వీడేట్ కూడా
న్యూఢిల్లీ, నవంబరు 24: సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతూ.. యుద్ధోన్మాదంతో వనరులను సమకూర్చుకుంటున్న డ్రాగన్ దేశం చైనాపై భారత్ మరోమారు ‘డిజిటల్ స్ర్టైక్’ చేసింది. ఆ దేశానికి చెందిన 43 మొబైల్ యాప్స్పై నిషేధం విధించింది. గతంలో రెండు విడతలుగా పాపులర్ యాప్స్పై కేంద్ర ఐటీ శాఖ దృష్టి సారించగా.. ఈ సారి ఈ-కామర్స్తో ముడిపడి ఉన్న అప్లికేషన్లను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
తాజా నిషేధ జాబితాలో.. అలీబాబా గ్రూప్కు చెందిన అలీబాబా (హోల్సేల్), అలీ ఎక్స్ప్రెస్ (రిటైల్), అలీ పే (మొబైల్ వ్యాలెట్), లాలా మూవ్ ఇండియా (డెలివరీ యాప్)తోపాటు.. వీడేట్, డేట్మై ఏజ్, చైనా లవ్, ట్రూ ఏసియన్, ట్రూచైనీస్ వంటి డేటింగ్ యాప్లను బ్యాన్ చేసింది. గే-చాట్, లెస్బియన్ సోషల్ నెట్వర్క్-రేలా, మ్యాంగో టీవీ, వీటీవీ వంటటి యాప్లపైనా వేటు వేసింది. ఈ యాప్లు దేశ సార్వభౌమత్వానికి విఘాతం కలిగిస్తున్నాయని కేంద్రం వెల్లడించింది. యూజర్ల వ్యక్తిగత వివరాల గోప్యతనూ పాటించడం లేదని పేర్కొంది. కాగా.. తాజా బ్యాన్తో కలిపి ఐదు నెలల్లో నిషేధిత జాబితాకెక్కిన చైనా యాప్ల సంఖ్య 220కి చేరుకుంది.