ఈ హోటల్లో టీ కప్పు నుంచి టాయిలెట్ సీటు వరకు అంతా బంగారమే!
ABN , First Publish Date - 2020-07-06T01:42:35+05:30 IST
వియత్నంలోని ఓ హోటల్.. కాదు కాదు.. దాన్ని హోటల్ అనడం కంటే.. ఇంద్రభవనం అంటే బాగుటుంది. ఇంద్రభవనం ఎలా ఉంటుందో మనకు తెలియదు కా
హనోయ్: వియత్నంలోని ఓ హోటల్.. కాదు కాదు.. దాన్ని హోటల్ అనడం కంటే.. ఇంద్రభవనం అంటే బాగుటుంది. ఇంద్రభవనం ఎలా ఉంటుందో మనకు తెలియదు కానీ.. ఆ హోటల్ను చూస్తే.. ఇంద్రభవనం ఇలానే ఉంటుందేమో అని కచ్ఛితంగా అనుకుంటాం. ఓ హోటల్ను ఇంద్రభవనం అంటూ దాన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారేంటి అని అనుకుంటున్నారా? కానీ ఈ వార్త చదివిన తర్వాత మీరు కూడా ఈ మాటలతో ఏకీభవిస్తారేమో. వియత్నంలోని డోల్స్ హనోయ్ గోల్డ్ లేక్ హోటల్. పేరులోనే కాదు.. హోటల్లోని ప్రతి వస్తువులో బంగారమే ఉంటుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కరోనా కారణంగా ప్రపంచమే స్తంభించిపోయింది. దాదాపు రెండు నుంచి మూడు నెలలపాటు యావత్ ప్రపంచం స్వీయ నిర్భంధంలోకి వెళ్లిపోయింది. ప్రపంచ దేశాల మాదరిగానే వియత్నం కూడా దాదాపు మూడు నెలలపాటు లాక్డౌన్ అయింది. అయితే లాక్డౌన్ నిబంధనలను ఈ మధ్యే ఎత్తేసిన వియత్నం.. ఆర్థిక రంగాన్ని పటిష్టం చేసుకోవడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా పర్యాటకరంగాన్ని ప్రోత్సహిస్తోంది. ఈ నేపథ్యంలోనే వియత్నంలో కొద్ది రోజుల క్రితం ప్రపంచంలోనే మొట్టమొదటి ఐదు నక్షత్రాల గోల్డ్ ప్లేటెడ్ హోటల్ ప్రారంభమైంది. ఇందులో టీ కప్పు నుంచి తినే ప్లేట్ల వరకు, బాత్టబ్ నుంచి స్విమ్మింగ్పూల్ టైల్స్ వరకు, వాష్ బేషన్ నుంచి టాయిలెట్ సీట్ వరకు అన్నీ 24 క్యారెట్ల బంగారు రంగు పూతతో తళుక్కుమంటున్నాయి. ప్రస్తుతం ఈ హోటల్ ఫొటోలు సామాజిక మాద్యమాల్లో హల్చల్ చేస్తూ.. అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి. కాగా.. ఈ హోటల్లో ఒకరాత్రి బస చేయడానికి అయ్యే ఖర్చు నెటిజన్లను మరింత ఆశ్చర్యానికి గురిచేస్తొంది. అవునండీ.. ఇంద్రభవనం లాంటి ఈ హోటల్లో ఒక రాత్రి బస చేయడానికి కేవలం 250 డాలర్లు మాత్రమే చార్జ్ చేస్తారట. అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు 18,600 అన్నమాట. అయితే ఈ హోటల్ను కట్టడానికి 11 సంవత్సరాలు పట్టిందట. అంతేకాకుడా 200 మిలియన్ డాలర్లు ఖర్చు అయిందట.