దుబాయ్-హైదరాబాద్.. రయ్ రయ్
ABN , First Publish Date - 2020-09-14T13:56:33+05:30 IST
హైదరాబాద్లోని రియాసత్నగర్కు చెందిన ఓ యువకుడు దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నాడు. కుటుంబ సభ్యులను చూసేందుకు
- విమాన సర్వీసుల పునరుద్ధరణతో నగరవాసుల హర్షం
హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్లోని రియాసత్నగర్కు చెందిన ఓ యువకుడు దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నాడు. కుటుంబ సభ్యులను చూసేందుకు సెలవుపై ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్కు వచ్చాడు. మార్చి నెలాఖరుకు తిరిగి వెళ్లేలా ప్రణాళికలు రూపొందించుకున్నాడు. కానీ, లాక్డౌన్తో విమాన సర్వీసుల రద్దయి ఇక్కడే ఉండిపోయాడు. జీతం పరంగా భారీగా నష్టపోయాడు. తాజాగా వారంలో మూడు రోజుల పాటు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమానాలు నడిపేలా ఫ్లై దుబాయ్, ఎయిర్ అరేబియా సంస్థలతో ఒప్పందం కుదిరింది. దీంతో అతడు ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. వాస్తవానికి దుబాయ్కి రాకపోకలు సాగించే హైదరాబాద్ వాసు ల సంఖ్య ఎక్కువే. అక్కడ ఉద్యోగం చేసేవారితో పా టు వివిధ వ్యాపారాలు, బంధుమిత్రులు ఉండట మే దీనికి కారణం. అయితే, కరోనా నేపథ్యంలో విమానాల రద్దుతో ఎక్కడివారు అక్కడే ఉండిపోయారు. ఇప్పుడు సర్వీసుల పునఃప్రారంభంతో ఇలాంటివారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్ టిక్కెటింగ్ ఏజెంట్లు సైతం ఆశావహంగా ఉన్నారు.
బంధువులు పిలుస్తున్నారు
మాకు దుబాయ్లో చాలామంది బంధువులు, స్నేహితులు ఉన్నారు. ఏ చిన్న కార్యక్రమం జరిగినా నన్ను పిలుస్తుంటారు. గతంలో చాలాసార్లు వెళ్లొచ్చాను. లాక్డౌన్ నేపథ్యంలో ఈసారి వెళ్లలేకపోయాను. అక్కడివారు రమ్మని పిలుస్తున్నారు. హైదరాబాద్ నుంచి విమానాలు నడుస్తుండటంతో ఆనందంగా ఉంది. వారం పది రోజుల తర్వాత ఓ ట్రిప్ వేస్తా.
అక్బర్ ఖాన్, చాంద్రాయణగుట్ట
వ్యాపారం పుంజుకుంటుంది
నారాయణగూడ, శాలిబండ కేంద్రాలుగా టికెట్ బుకింగ్లు చేస్తుంటా. విమాన సర్వీసుల రద్దుతో ఆరు నెలలుగా వ్యాపారం నిలిచిపోయింది. జీవనోపాధికి ప్రత్యామ్నాయాలపై దృష్టిసారించాల్సి వచ్చింది. దుబాయ్- హైదరాబాద్ మధ్య సర్వీసుల ప్రారంభంతో గతంలోలా వ్యాపారం సాగే వీలుంది.
ఎయిర్ టిక్కెటింగ్ ఏజెంట్ దేవీదాస్