భారత్లోని ఆరు నగరాల నుంచి అబుధాబికి ఎతిహాద్ విమాన సర్వీసులు
ABN , First Publish Date - 2020-07-11T18:37:04+05:30 IST
గల్ఫ్ ఎయిర్లైన్స్ ఎతిహాద్ ఈ నెల 12 నుంచి 26 వరకు భారత్లోని ఆరు నగరాల నుంచి అబుధాబికి ప్రత్యేక విమాన సర్వీసులు నడపనున్నట్లు ప్రకటించింది.
న్యూఢిల్లీ: గల్ఫ్ ఎయిర్లైన్స్ ఎతిహాద్ ఈ నెల 12 నుంచి 26 వరకు భారత్లోని ఆరు నగరాల నుంచి అబుధాబికి ప్రత్యేక విమాన సర్వీసులు నడపనున్నట్లు ప్రకటించింది. విదేశాలకు విమాన సర్వీసులపై భారత్ ఆంక్షలు సడలిస్తూ నిర్ణయం తీసుకున్న మరుసటి రోజే ఎతిహాద్ ఈ ప్రకటన చేయడం విశేషం. ఇండియాలోని బెంగళూరు, చెన్నై, కొచ్చి, న్యూఢిల్లీ, హైదరాబాద్, ముంబై నగరాల నుంచి అబుధాబికి విమానాలు నడపనున్నట్లు ఎతిహాద్ తన ప్రకటనలో పేర్కొంది. "ప్రయాణీకులందరూ అబుధాబి ప్రభుత్వం నుంచి ఐసీఏ అనుమతి కలిగి ఉండాలి. అలాగే అవసరమైన అనుమతులు లేకుండా చెక్-ఇన్ చేయడానికి అనుమతించబడదు." అని ఎయిర్లైన్స్ యాజమాన్యం పేర్కొంది.
ఇక కరోనా లాక్డౌన్ కారణంగా భారత్లో చిక్కుకున్న యూఏఈ రెసిడెంట్స్కు కేంద్రం గురువారం గుడ్న్యూస్ చెప్పింది. 'వందే భారత్ మిషన్'లో భాగంగా 15 రోజుల పాటు ఇండియా నుంచి యూఏఈకి ప్రత్యేక విమాన సర్వీసులు నడపనున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 12 నుంచి 26 వరకు ఈ విమానాలు నడవనున్నాయి. ఈ మేరకు ఇరు దేశాల పౌర విమానయాన శాఖల మధ్య ఒప్పందం కూడా కుదిరింది. దీంతో వందలాది మంది భారతీయుల దీర్ఘకాల నిరీక్షణకు తెర పడినట్లైంది.