ఈఫిల్ టవర్ సందర్శకులకు శుభవార్త.. ఈ నెల 15 నుంచి..!
ABN , First Publish Date - 2020-07-10T04:31:59+05:30 IST
కరోనా వైరస్ ప్రపంచాన్ని అల్లాడిస్తోంది. ఈ మహమ్మారి ప్రభావం ఫ్రాన్స్పై కూడా తీవ్రంగా పడింది. ఫ్రాన్స్ అనగానే వెంటనే గుర్తొచ్చేది.. ప్రపంచ వింతల్లో ఒక
పారిస్: కరోనా వైరస్ ప్రపంచాన్ని అల్లాడిస్తోంది. ఈ మహమ్మారి ప్రభావం ఫ్రాన్స్పై కూడా తీవ్రంగా పడింది. ఫ్రాన్స్ అనగానే వెంటనే గుర్తొచ్చేది.. ప్రపంచ వింతల్లో ఒకటైన ఈఫిల్ టవర్. కొవిడ్-19 ఫ్రాన్స్పై పంజా విసరడంతో సుమారు మూడు నెలలపాటు ఈఫిల్ టవర్ మూతపడింది. సందర్శకుల తాకిడి లేక.. ఈఫిల్ టవర్ పరిసరాలు వెలవెలబోయిన విషయం తెలిసిందే. అయితే కొద్ది రోజుల క్రితం లాక్డౌన్ నిబంధనలు సడలించిన ఫ్రాన్స్.. పర్యాటక ప్రాంతాలను తిరిగి ప్రారంభించింది. దీంతో ఈఫిల్ టవర్లోని మొదటి రెండు ఫ్లోర్లలోకి జూన్ 26 నుంచి పర్యాటకులను అధికారులు అనుమతించారు. తాజాగా ఈ నెల 15 నుంచి ఈఫిల్ టవర్ చివరి ఫ్లోర్కి సందర్శకులను అనుమతించనున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే కరోనా నేపథ్యంలో సందర్శకులు మాస్క్ను ధరించడంతోపాటు, భౌతిక దూరాన్ని కూడా కచ్చితంగా పాటించాలని సూచించారు. ఈఫిల్ టవర్ను 104రోజులపాటు మూసివేయడం వల్ల సుమారు 30మిలియన్ డాలర్ల నష్టం వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం సుమారు 7 మిలియన్ల మంది ఈఫిల్ టవర్ను సందర్శిస్తారని అధికారులు వివరించారు. ఇదిలా ఉంటే.. ఫ్రాన్స్లో ఇప్పటి వరకు సుమారు 1.69లక్షల మంది కరోనా బారినపడగా.. అందులో దాదాపు 30వేల మంది ప్రాణాలు కోల్పోయారు.