బుర్జ్ ఖలీఫా వద్ద భారత సంతతి బాలిక యోగాలో మరో ప్రపంచ రికార్డు
ABN , First Publish Date - 2020-07-19T16:47:57+05:30 IST
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఆకాశహర్మ్యంగా పేరొందిన బుర్జ్ ఖలీఫా వద్ద భారత సంతతి బాలిక సమృధి కలియా(11) యోగాలో మరో ప్రపంచ రికార్డు సృష్టించింది.

దుబాయి: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఆకాశహర్మ్యంగా పేరొందిన బుర్జ్ ఖలీఫా వద్ద భారత సంతతి బాలిక సమృధి కలియా(11) యోగాలో మరో ప్రపంచ రికార్డు సృష్టించింది. కేవలం మూడు నిమిషాల్లో ఒక చిన్న పెట్టెలో వంద యోగాసనాలు వేసి మరో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. ఇది సమృధికి యోగాలో మూడో ప్రపంచ రికార్డు కాగా... గత నెల 21న ప్రపంచ యోగాదినోత్సవం సందర్భంగా కేవలం నిమిషం వ్యవధిలో 40 యోగాసనాలు వేసి ప్రపంచ రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. దుబాయ్లోని అంబాసిడర్ స్కూల్లో గ్రేడ్ 7 విద్యార్థిని అయిన సమృధి ఎంతో కృషి, పట్టుదలతో ఇటువంటి అద్భుతమైన విజయాలు సాధించవచ్చని అభిప్రాయపడింది. "సాహసాన్ని కొనసాగించే ధైర్యం ఉంటే మన కలలన్నీ నిజమవుతాయి. నిశ్శబ్దంగా కష్టపడండి, విజయం మీ శబ్దం కావనివ్వండి. నా గొప్ప ఆస్తి నా శారీరక సామర్థ్యం కాదు, అది నా మానసిక సామర్థ్యం అని నేను భావిస్తున్నాను" అని తెలిపింది. ఇక చిన్న వయసులో సమృధి కలియా యోగాలో సాధిస్తున్న ప్రపంచ రికార్డులను చూసి ఆమె తల్లిదండ్రులు ఎంతో ఆనందిస్తున్నారు.