ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. రానున్నది గడ్డుకాలమంటూనే..
ABN , First Publish Date - 2020-04-01T17:12:23+05:30 IST
అగ్రరాజ్యం అమెరికాను మహమ్మారి కరోనా వైరస్ గడగడలాడిస్తోంది. రోజురోజుకీ యూఎస్లో 'కొవిడ్-19' తన ప్రాబల్యాన్ని పెంచుకుంటూ వెళ్తోంది.

వాషింగ్టన్ డీసీ: అగ్రరాజ్యం అమెరికాను మహమ్మారి కరోనా వైరస్ గడగడలాడిస్తోంది. రోజురోజుకీ యూఎస్లో 'కొవిడ్-19' తన ప్రాబల్యాన్ని పెంచుకుంటూ వెళ్తోంది. దీంతో గత ఐదారు రోజులుగా వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 1,88,578 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 4,054 మంది మృతి చెందారు. న్యూయార్క్ నగరం పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇక్కడ ఇప్పటివరకు ఏకంగా 75,983 కేసులు నమోదయ్యాయి.
న్యూయార్క్ తర్వాత న్యూజెర్సీ, కాలిఫోర్నియా, మిచిగాన్, ఫ్లోరిడా, మసాచుసెట్స్, ఇల్లినాయిస్, వాషింగ్టన్, లూసియానా, పెన్సీల్వేనియా, జార్జీయా, టెక్సాస్ తదితర రాష్ట్రాల్లో ఈ మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో దేశంలో నెలకొన్న విపత్కర పరిస్థితులపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. రాబోయే రెండు వారాలు ఎంతో కఠినమైవనవి, అమెరికన్లు ధైర్యంగా ఉండాలని తెలిపారు. ఇంకో బాధాకరమైన విషయం ఏమిటంటే... దేశంలో ప్రస్తుతం మహమ్మారి కరోనా విస్తరిస్తున్న తీవ్రతను బట్టి సుమారు 2.40 లక్షల మది ప్రాణాలు కోల్పోవచ్చని తెలిపారు. ఇది తాను చెబుతున్నది కాదని.. వైద్య నిపుణుల అంచనా ప్రకారం తెలిసిన చేదు నిజమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన కరోనాను ప్లేగు వ్యాధితో పోల్చారు. రాబోయే కఠిన రోజులను ఎదుర్కొనేందుకు అమెరికన్లు రెడీగా ఉండాలాని సూచించారు. పౌరులు తప్పనిసరిగా వ్యక్తిగత శుభ్రత, సామాజిక దురాన్ని పాటించాలన్నారు. ఇలా చేయడం వల్ల తమను తాము కాపాడుకోవడంతో పాటు చుట్టుపక్కల వారిని కూడా కరోనా బారినపడకుండా కాపాడిన వారు అవుతారని ట్రంప్ తెలియజేశారు.
అమెరికాలో కరోనా బారిన పడి.. దాదాపు 2లక్షల 40వేల మందికి పైగా చనిపోతారని అమెరికా దౌత్యవేత్త, వైద్యురాలు అయిన డెబోరహ్ లీహ్ బిర్క్ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె.. వైట్హౌస్ కరోనా వైరస్ టాస్క్ ఫోర్స్ కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నారు. ఆమె ఈ ప్రకటన చేసిన మరుసటి రోజే ట్రంప్.. రానున్నది గడ్డు కాలం.. ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పడం గమనార్హం..
"ఈ మహమ్మారికి వ్యాక్సిన్ లేదు. ప్రజలు సామాజిక దూరం పాటించడం వల్లే దీని వ్యాప్తిని అరికట్టడానికి వీలవుతుంది. కనుక రాబోయే 30 రోజుల పాటు ప్రజలు ఎంతో సంయనంతో ఇళ్లకే పరిమితం కావాలని" డెబోరహ్ లీహ్ బిర్క్ తెలిపారు.