యూఎస్లోనూ 'టిక్టాక్' బ్యాన్కు డిమాండ్
ABN , First Publish Date - 2020-07-02T13:09:21+05:30 IST
టిక్టాక్ సహా 59 చైనా యాప్లను భారత్ నిషేధించడంపై అమెరికాలో సానుకూల స్పందన వ్యక్తమవుతోంది.
టిక్టాక్ బ్యాన్కు ప్రజాప్రతినిధుల డిమాండ్
వాషింగ్టన్, జూలై 1: టిక్టాక్ సహా 59 చైనా యాప్లను భారత్ నిషేధించడంపై అమెరికాలో సానుకూల స్పందన వ్యక్తమవుతోంది. దేశ భద్రత కారణాలతో అమెరికాలోనూ టిక్టాక్ను వెంటనే నిషేధించాలని అక్కడి ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. భారత్కు మద్దతుగా రిపబ్లికన్ సెనెటర్ జాన్ కోర్నిన్ ట్వీట్ చేశారు. ఇప్పటికే అమెరికా టిక్టాక్ను నిషేధించి ఉండాల్సిందని మరో రిపబ్లికన్ ప్రజాప్రతినిధి రిక్ క్రాఫోర్డ్ ట్విట్టర్లో పేర్కొన్నారు. గత వారం అమెరికా జాతీయ భద్రత సలహాదారు రాబర్ట్ ఓబ్రెయిన్ మాట్లాడుతూ, చైనా ప్రభుత్వం తన సొంత ప్రయోజనాలకు టిక్టాక్ను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. అమెరికాలో 4 కోట్ల మంది టిక్టాక్ వాడుతున్నారని, వారిలో ఎవరైనా చైనా కమ్యూనిస్టు పార్టీని తిడుతూ వీడియోలు పెట్టినపుడు వాటిని ఆటోమాటిక్గా టిక్టాక్ యాప్ డిలిట్ చేస్తుందని తెలిపారు. అమెరికా ప్రభుత్వ ఉద్యోగులు టిక్టాక్ వాడటాన్ని నిషేధించాలంటూ రూపొందించిన రెండు బిల్లులు కాంగ్రె్సలో పెండింగ్లో ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడి వాణిజ్య వ్యవహారాల సలహాదారు పీటర్ నవరో కూడా నిషేధాన్ని సమర్థించారు. ట్రంప్ పాల్గొన్న టుల్సా ర్యాలీలో జనం ఎక్కువగా పాల్గొనకుండా టిక్టాక్ ప్రభావితం చేసిందని ఆరోపించారు. ఫాక్స్ న్యూస్కు చెందిన ప్రముఖ యాంకర్ లారా ఇన్గ్రాహం కూడా టిక్టాక్ను నిషేధించాలని కోరారు. ఐవోఎస్ 14 ఇన్స్టాల్ చేసిన యాపిల్ ఫోన్లలో వ్యక్తిగత సమాచారాన్ని టిక్టాక్ దొంగిలిస్తున్నట్లు యాపిల్ కంపెనీ ఇటీవలి పరిశోధనల్లో వెల్లడైంది. వెంటనే ఈ విషయమై యాపిల్ సంస్థ టిక్టాక్ను ప్రశ్నించగా, ఆ లొసుగును సరిదిద్దుతామని హామీ ఇచ్చింది. టిక్టాక్ మీద భారత్ నిషేధం నేపథ్యంలో ఫోర్బ్స్ పత్రిక తాజాగా ఈ అంశాన్ని మరోసారి తెర మీదకు తెచ్చింది. అమెరికా రవాణా శాఖ అధికారులు టిక్టాక్ యాప్ ఉన్న ఫోన్లను వాడరాదనే బిల్లుపై గతవారం అమెరికన్ కాంగ్రె్సలో చర్చ జరిగింది. ప్రభుత్వం ఇచ్చే సెల్ఫోన్లలో టిక్టాక్ యాప్ డౌన్లోడ్ చేయరాదని ప్రతిపాదిస్తూ రిపబ్లికన్ సభ్యుడు జాషువా డేవిడ్ హాలే గత ఏప్రిల్లో మరో బిల్లు పెట్టారు. అమెరికా భద్రతకు ఇది అత్యవసరమని చెప్పారు. టిక్టాక్ చైనాలో రిజిస్టర్ అయిన కంపెనీ అని, అది అక్కడి ప్రభుత్వమైన చైనా కమ్యూనిస్టు పార్టీ చెప్పినట్లు వినాల్సి ఉంటుందని, పార్టీ అడిగిన ఏ సమాచారాన్నయినా షేర్ చేయాల్సి ఉంటుందని న్యాయశాఖ స్థాయీ సంఘం చైర్మన్ అయిన సెనెటర్ హాలే వ్యాఖ్యానించారు.