బిల్లు రూ.15వేలు.. టిప్పు రూ.3.68 లక్షలు !
ABN , First Publish Date - 2020-12-17T17:05:09+05:30 IST
పండగ పూట అమెరికాలో ఓ కస్టమర్ ఉదారత చాటుకున్నారు. పెన్సిల్వేనియాలోని ఇటాలియన్ రెస్టారెంట్కు వెళ్లిన ఓ కస్టమర్ తాను చేసిన 205 డాలర్ల(రూ. 15వేలు) బిల్లుపై ఏకంగా 5వేల డాలర్ల (రూ. 3.68 లక్షలు) టిప్పు ఇచ్చి పెద్ద మనసు చాటారు.

పెన్సిల్వేనియా: పండగ పూట అమెరికాలో ఓ కస్టమర్ ఉదారత చాటుకున్నారు. పెన్సిల్వేనియాలోని ఇటాలియన్ రెస్టారెంట్కు వెళ్లిన ఓ కస్టమర్ తాను చేసిన 205 డాలర్ల(రూ. 15వేలు) బిల్లుపై ఏకంగా 5వేల డాలర్ల (రూ. 3.68 లక్షలు) టిప్పు ఇచ్చి పెద్ద మనసు చాటారు. వివరాల్లోకి వెళ్తే... పెన్సిల్వేనియాలోని ఇటాలియన్ రెస్టారెంట్ ఆంథోనీస్ ఎట్ పాక్సన్కు శనివారం(డిసెంబర్ 12న) ఓ అజ్ఞాత కస్టమర్ వెళ్లారు. ఆ కస్టమర్ బిల్లు రూ. 15వేలు అయింది. కానీ, బిల్లుతో పాటు రూ.3.68 లక్షల టిప్పు ఇచ్చి కస్టమర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అది చూసిన రెస్టారెంట్ యజమానికి మొదట నోటమాట రాలేదు. ఆ తర్వాత తేరుకుని కస్టమర్ చేసిన సహాయానికి ధన్యవాదాలు తెలిపారు. కరోనా వల్ల ఆర్థిక సమస్యలతో సతమతమవుతన్న తమ స్టాఫ్కు కస్టమర్ ఇచ్చిన ఈ సర్ప్రైజ్ గిఫ్ట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని యజమాని చెప్పారు.
ఈ సందర్భంగా ఆంథోనీస్ ఎట్ పాక్సన్ రెస్టారెంట్ యజమాని.. కస్టమర్ బిల్లు తాలూకు స్లిప్ను ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. అలాగే "మీరు చేసిన సాయానికి మాకు మాటలు రావడం లేదు. మా స్టాఫ్కు ఇది చాలా పెద్ద సపోర్ట్. ధన్యవాదాలు" అని రాసుకొచ్చారు. దీంతో ఈ పోస్టు నెట్టింట వైరల్ అయింది. దాతృత్వం చాటిన కస్టమర్పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. “అమేజింగ్! ప్రపంచంలో మంచి వ్యక్తులను చూడటం చాలా అద్భుతంగా ఉంది ” అని ఒకరు, “వావ్! ఇది నిజంగా అద్భుతం! ఈ ప్రపంచంలో ఇంకా మంచి వ్యక్తులు ఉన్నారు! ” అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. కాగా, ఈ భారీ మొత్తం టిప్పు అందుకున్న సర్వర్ జియానా డిఎంజెలో నర్సింగ్ చదువుతున్న ఫ్రెష్మాన్. ఈ డబ్బు తన యూనివర్శిటీ ఖర్చులకు సహాయపడుతుందని జియానా ఆనందం వ్యక్తం చేశారు. కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో తమను ఆర్థికంగా ఆదుకున్న కస్టమర్కు ఈ సందర్భంగా డిఎంజెలో ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.