విదేశీయులు కనిపిస్తే చాలు.. పరుగే పరుగు!
ABN , First Publish Date - 2020-03-08T14:08:39+05:30 IST
హైదరాబాద్ మన్సూరాబాద్ డివిజన్ సహారా ఎస్టేట్స్ వాసులు విదేశీయులు కనిపిస్తే ఉలిక్కిపడుతున్నారు.

హైదరాబాద్ సహారా ఎస్టేట్స్ వాసుల్లో కరోనా వైరస్ భయం
హైదరాబాద్, మన్సూరాబాద్, నిర్మల్, అడ్డగుట్ట, శంషాబాద్,మార్చి 7 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ మన్సూరాబాద్ డివిజన్ సహారా ఎస్టేట్స్ వాసులు విదేశీయులు కనిపిస్తే ఉలిక్కిపడుతున్నారు. ఇతర దేశాల్లో కరోనా వైరస్ తీవ్రంగా ఉండటం.. అక్కడినుంచి వచ్చినవారి ద్వారా తమకూ వ్యాప్తి చెందుతుందనే భయమే ఇందుకు కారణం. స్థానిక గేటెడ్ కమ్యూనిటీలోని ఆయుర్వేద వైద్యుడు వద్దకు కొన్నాళ్లుగా విదేశీయులు వస్తున్నారు. అద్దె ఇళ్లలో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. అయితే, వైరస్ వ్యాప్తి అపోహతో వారు కన్పిస్తే స్థానికులు దూరంగా వెళ్లిపోతున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన నిర్మల్ జిల్లావాసి ఒకరిలో కరోనా లక్షణాలు కనిపించాయి.
వైద్యులు ఈ విషయమై చర్చిస్తుండగా అతడు ఆస్పత్రి నుంచి పారిపోయాడు. ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది పట్టుకుని అంబులెన్స్లో గాంధీకి తరలించారు. ఉమ్రా పర్యటన ముగించుకుని శనివారం శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన హైదరాబాద్ గచ్చిబౌలికి చెందిన దంపతుల్లో వైరస్ లక్షణాలు ఉండటంతో వారిని గాంధీకి తరలించారు. కాగా.. శుక్రవారం సేకరించిన 19 నమూనాల్లో 5 నెగెటివ్ వచ్చాయి. మిగతావాటి ఫలితాలు రావాల్సి ఉంది.
హెచ్చార్సీలో అవగాహన సమావేశం
‘కరోనాపై భయాందోళనలకు గురికావొద్దు. వదంతులను నమ్మొద్దు. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులకే ఈ వైరస్ సోకే అవకాశాలున్నాయి. చికెన్ తినడం వల్ల కరోనా రాదు. ప్రజలు స్వీయ అవగాహన కలిగి ఉండాలి’ అని వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు, వైద్యులు సూచించారు. కరోనా వైర్సపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ)లో చైర్మన్ జస్టిస్ జి.చంద్రయ్య అధ్యక్షతన శనివారం అవగాహన సమావేశం నిర్వహించారు.
కరోనాపై చోటాభీమ్ వీడియో
ట్విటర్లో పోస్టు చేసిన కేటీఆర్
కరోనాపై అవగాహన కల్పించేందుకు ఓ యానిమేషన్ సంస్థ రూపొందించిన చోటా భీమ్ వీడియోను మంత్రి కేటీఆర్ ట్విటర్లో షేర్ చేశారు. పిల్లలు అత్యంత ఇష్టపడే చోటా భీమ్ పాత్ర ద్వారా.. కరోనా వంటి కీలక, అత్యంత ఆవశ్యక అంశంపై ప్రజలను చైతన్య పరిచేందుకు ముందుకొచ్చిన యానిమేషన్ సంస్థను మంత్రి అభినందించారు.