విదేశాల నుంచి వచ్చిన వారిపై నిరంతర నిఘా..
ABN , First Publish Date - 2020-03-24T13:18:03+05:30 IST
విదేశాల నుంచి వచ్చిన వారి విషయంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

ఇప్పటికే పలువురి గుర్తింపు..
దిల్సుఖ్నగర్ జోన్ బృందం, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): విదేశాల నుంచి వచ్చిన వారి విషయంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. సోమవారం ఓ వ్యక్తి సరూర్నగర్ సర్కిల్ కార్యాలయానికి వచ్చి తాను ఇండోనేషియా నుంచి వచ్చి మూడు రోజులైందని, వైద్య పరీక్షలు చేయాలని కోరడంతో అక్కడి వారు అవాక్కయ్యారు. తేరుకుని పోలీసులకు సమాచారం అందించడంతో వారు వచ్చి అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. పెద్దఅంబర్పేట్ మున్సిపాలిటీ పరిధిలో 12 మంది, అబ్దుల్లాపూర్మెట్ మండల పరిధిలో ఇద్దరు వారం పది రోజుల క్రితం ఇతర దేశాల నుంచి వచ్చినట్లు గుర్తించారు.
మన్సూరాబాద్ డివిజన్లోని హయత్నగర్ వినాయకనగర్ కాలనీలో ఒకరు 15 రోజుల క్రితం లండన్ నుంచి వచ్చినట్లు స్థానికులు ఫిర్యాదు చేసినట్లు మున్సిపాలిటీ అధికారులు తెలిపారు. హయత్నగర్ సర్కిల్ డీసీ మారుతీ దివాకర్, ఇతర అధికారులకు సోమవారం ఒక్క రోజే నలుగురు ఫోన్ చేసి విదేశాల నుంచి వచ్చిన వారి గురించి వివరించారు. వారు వెళ్లి పరిశీలించి ఆ నలుగురిని హోం క్వారంటైన్లో ఉండాలని సూచించి, స్టాంపులు వేశారు. హయాత్నగర్ సర్కిల్ పరిధిలో ఇటీవల విదేశాల నుంచి 211 మంది రాగా, వారిలో 121 మందిని గుర్తించినట్లు డీసీ మారుతీ దివాకర్ తెలిపారు. ఇందులో 80 మందికి ఇప్పటికే కరోనా స్టాంపులు వేసినట్లు తెలిపారు. మిగతా వారికి మంగళవారం పూర్తి చేస్తామన్నారు. ఎల్బీనగర్ సర్కిల్ పరిధిలో మొత్తం 128 మంది విదేశాల నుంచి వచ్చినట్లు వివరాలు అందాయని ఉపకమిషనర్ విజయ్కృష్ణ తెలిపారు.
113 మందిని గుర్తించామని, ఇందులో ఇద్దరు వైజాగ్కు, మరొక వ్యక్తి డల్లా్సకు వెళ్లాడని ఆయన చెప్పారు. ఇంకా 12 మందిని గుర్తించాల్సి ఉందన్నారు. సరూర్నగర్ సర్కిల్ పరిధిలో విదేశాల నుంచి మొత్తం 313 వచ్చినట్లు వివరాలు అందాయని ఉపకమిషనర్ హరికృష్ణయ్య తెలిపారు. వారిలో 150 మందిని గుర్తించామని, 163 మందిని గుర్తించాల్సి ఉందన్నారు. సైదాబాద్ మండల పరిధిలో 80 మంది వివిధ దేశాల నుంచి వచ్చినట్లు అధికారులు నిర్థారించారు.
కుత్బుల్లాపూర్ సర్కిల్లో 23 మంది..
కుత్బుల్లాపూర్, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలో ఇటీవల వివిధ దేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించి, వారికి హోం క్వారంటైన్ ముద్రలు వేస్తున్నారు. మొత్తం 131 మంది విదేశాల నుంచి రాగా, ఇప్పటి 129 మందిని గుర్తించారు. ఇందులో ఇద్దరు ఆ చిరునామాలో లేరు. గాజులరామారం సర్కిల్ పరిధిలో 73 మందిలో 38 మందిని గుర్తించారు. 35 మంది చిరునామాలో దొరకలేదు. దీంతో వారి జాడ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
డివిజన్ల వారీగా
కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలో రంగారెడ్డినగర్ డివిజన్లో 11 మంది, సుభా్షనగర్ డివిజన్లో 27 మంది, కుత్బుల్లాపూర్ డివిజన్లో 20 మంది, జీడిమెట్ల డివిజన్లో 73 మంది ఇటీవల విదేశాల నుంచి వచ్చిన వారిని ప్రత్యేక బృందాలు పరిశీలించారు. గాజలరామారం సర్కిల్ పరిధిలో గాజులరామారం డివిజన్లో 50 మంది, జగద్గిరిగుట్ట డివిజన్లో 5 మంది, చింతల్ డివిజన్లో 6 మంది, సూరారం డివిజన్లో 12 మంది ఇటీవల విదేశాల నుంచి వచ్చిన వారిని ప్రత్యేక బృందాలు గుర్తించాయి.