బుర్జ్ ఖలీఫాపై మువ్వన్నెల వెలుగులు..!
ABN , First Publish Date - 2020-08-16T15:12:23+05:30 IST
భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా శనివారం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఆకాశహర్మ్యంగా పేరొందిన బుర్జ్ ఖలీఫాను భారతీయ త్రివర్ణ పతాక రంగులతో ఎల్ఈడీ విద్యుత్ దీపాలంకరణ చేశారు.

దుబాయ్: భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా శనివారం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఆకాశహర్మ్యంగా పేరొందిన బుర్జ్ ఖలీఫాను భారతీయ త్రివర్ణ పతాక రంగులతో ఎల్ఈడీ విద్యుత్ దీపాలంకరణ చేశారు. త్రివర్ణ పతాకాన్ని ప్రతిబింబిస్తూ చేసిన ఈ లేజర్ షో భారత ప్రవాసుల మనస్సులను దోచుకుంది. బుర్జ్ ఖలీఫాతో పాటు అబుధాబిలోని అడ్నోక్ టవర్పై కూడా మువ్వన్నెల వెలుగులు విరజిమ్మాయి. శనివారం రాత్రి 8.45 గంటల ప్రాంతంలో జరిగిన ఈ లేజర్ షోకు సంబంధించిన లైవ్ వీడియోను దుబాయిలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా(సీజీఐ) ట్వీట్ చేసింది. 74వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత స్ఫూర్తిని ప్రతిధ్వనించినందుకు యూఏఈకి సీజీఐ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది. అలాగే భారతీయ త్రివర్ణంతో మెరుస్తున్న బుర్జ్ ఖలీఫా, అడ్నోక్ టవర్ ఫొటోలను కూడా షేర్ చేసింది. ఇక స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోదీకు దుబాయ్ అధినేతలు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సందేశాలు పంపించారు.