అధ్యక్ష ఎన్నికల్లో ఆయన గెలిస్తేనే భారత్ చిరకాల స్వప్నం నెరవేరుతుందట!

ABN , First Publish Date - 2020-07-19T22:50:27+05:30 IST

అమెరికాలో అధ్యక్ష పదవికి ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. నవంబర్ 3న జరిగే ఈ ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ తరఫున ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బరిలోకి

అధ్యక్ష ఎన్నికల్లో ఆయన గెలిస్తేనే భారత్ చిరకాల స్వప్నం నెరవేరుతుందట!

వాషింగ్టన్: అమెరికాలో అధ్యక్ష పదవికి ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. నవంబర్ 3న జరిగే ఈ ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ తరఫున ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బరిలోకి దిగుతున్నారు. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌ను ఢీ కొననున్నారు. ఈ నేపథ్యంలో తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ట్రంప్.. ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలో గతంలో ఇండియాలో అమెరికా రాయబారిగా పని చేసిన రిచర్డ్ వర్మా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. ఓ సమావేశంలో మాట్లాడిన ఆయన.. రానున్న అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ గెలుపొందితే.. భారత్ చిరకాల స్వప్నం నెరవేరడానికి బైడెన్ కృషి చేస్తారని పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌ శాశ్వత సభ్యత్వం పొందటానికి బైడెన్ సహాయం చేయనున్నట్లు రిచర్డ్ వర్మా వెల్లడించారు. అంతేకాకుండా భారతీయులకు, ఇండియన్-అమెరికన్లకు మంచి స్నేహితుడిగా బైడెన్‌కు మంచి ట్రాక్ రికార్డు ఉందన్నారు. కాగా.. 2014-17 మధ్యకాలంలో భారత్‌లో అమెరికా రాయబారిగా పని చేసిన రిచర్డ్ వర్మా.. ప్రస్తుతం జో బైడెన్‌కు మద్దతు తెలుపుతూ, ఎన్నికల ప్రచారంలో క్రియాశీలకంగా పని చేస్తున్నారు. అమెరికాలో ఇండియన్-అమెరికన్ల జనాభా 2.4 మిలియన్ల వరకు ఉంటుంది. ఇందులో చాలా మంది రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ క్రమంలో రిచర్డ్ వర్మా చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.


Updated Date - 2020-07-19T22:50:27+05:30 IST