అందరికీ కొవిడ్ టీకా ఉచితంగా అందిస్తాం: బహ్రెయిన్
ABN , First Publish Date - 2020-12-11T14:39:10+05:30 IST
కొవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీపై బహ్రెయిన్ కీలక ప్రకటన చేసింది.
మనామా: కొవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీపై బహ్రెయిన్ కీలక ప్రకటన చేసింది. దేశ పౌరులు, నివాసితులందరికీ ఉచితంగా టీకా అందిస్తామని తాజాగా వెల్లడించింది. వ్యాక్సిన్ పంపిణీ కోసం ఇప్పటికే దేశవ్యాప్తంగా 27 మెడికల్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. కాగా, బ్రిటన్ తర్వాత ఫైజర్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చిన రెండో దేశంగా బహ్రెయిన్ నిలిచిన సంగతి తెలిసిందే. అమెరికాకు చెందిన ఫైజర్, జర్మన్ సంస్థ బయోఎన్టెక్ సంయుక్తంగా రూపొందించిన ఈ వ్యాక్సిన్ కోసం గత శుక్రవారం(డిసెంబర్ 4) బహ్రెయిన్ అత్యవసర వినియోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, ఎన్ని డోసులు కొనుగోలు చేస్తుంది, ఎప్పటి నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభిస్తుందో మాత్రం వెల్లడించలేదు. అలాగే ఫ్రంట్లైన్ వర్కర్ల కోసం చైనా అభివృద్ధి చేసిన కొవిడ్ టీకా 'సినోఫార్మ్'ను కూడా బహ్రెయిన్ నవంబర్లో అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.