ట్రంప్కు మరో పరాభవం !
ABN , First Publish Date - 2020-12-10T01:57:36+05:30 IST
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు సుప్రీం కోర్టులో మరో పరాభవం ఎదురైంది. పెన్సిల్వేనియా నుంచి జో బైడెన్ ఎన్నిక చెల్లదంటూ రిపబ్లికన్స్ వేసిన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం మంగళవారం తిరస్కరించింది.
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు సుప్రీం కోర్టులో మరో పరాభవం ఎదురైంది. పెన్సిల్వేనియా నుంచి జో బైడెన్ ఎన్నిక చెల్లదంటూ రిపబ్లికన్స్ వేసిన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం మంగళవారం తిరస్కరించింది. రిపబ్లికన్స్ తరఫున ఆ పార్టీ ప్రతినిధి మైక్ కెల్లీ దాఖలు చేసిన ఈ పిటిషన్ను సుప్రీం కోర్టు కనీసం విచారించకుండానే కొట్టివేయడం గమనార్హం. మెయిల్ ఓట్లకు రాజ్యాంగపరంగా భద్రత లేనందున పెన్సిల్వేనియాలో మెయిల్ ఇన్ ఓట్ల ద్వారా గెలిచిన జో బైడెన్ ఎన్నిక చెల్లదనేది రిపబ్లికన్స్ ఆరోపణ. ఇదే విషయాన్ని మైక్ కెల్లీ తన పిటిషన్లో పేర్కొన్నారు.
కానీ, ఇలాంటి పనికిరాని చాలా పిటిషన్లను న్యాయస్థానం ఇప్పటికే కొట్టివేసిన నేపథ్యంలో ఈ పిటిషన్ను కూడా విచారించాల్సిన అవసరమే లేదని సుప్రీం కోర్టు పేర్కొంది. అయితే, 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అప్పటి రిపబ్లికన్ల అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మెయిల్ ఇన్ ఓట్ల ద్వారానే గెలిచారు. అప్పుడు చెల్లిన ఓట్లు బైడెన్ విషయంలో ఎలా చెల్లకుండా పోతాయని న్యాయవర్గాలు చెబుతున్నాయి. అయినా, ట్రంప్ వెనకాడుగు వేయకుండా బైడెన్ విజయం సాధించిన చాలా చోట్ల కోర్టులను ఆశ్రయిస్తుండడం గమనార్హం.