మూడు వారాల తర్వాత కువైట్ నుంచి భారత్కు తొలి విమానం
ABN , First Publish Date - 2020-08-12T14:51:18+05:30 IST
దాదాపు మూడు వారాల విరామం తర్వాత ఎట్టకేలకు కువైట్ నుంచి భారత్కు మంగళవారం ఓ విమానం వచ్చింది.

కువైట్ సిటీ: దాదాపు మూడు వారాల విరామం తర్వాత ఎట్టకేలకు కువైట్ నుంచి భారత్కు మంగళవారం ఓ విమానం వచ్చింది. అల్ టేయర్ గ్రూప్, లగ్జరీ ట్రావెల్స్ సంస్థలు ఏర్పాటు చేసిన ఈ విమానం కువైట్లో చిక్కుకున్న 322 మంది భారత ప్రవాసులను స్వదేశానికి తీసుకొచ్చింది. మంగళవారం ఉదయం 10 గంటలకు కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి ఈ ఫ్లైట్ బయల్దేరింది. గత ఆదివారం ఈ సంస్థలు కువైట్ నుంచి భారత్కు విమానం ఏర్పాటు చేస్తామని ప్రకటించాయి. చెప్పినట్లే మంగళవారం తొలి విమానం ఏర్పాటు చేశాయి. అంతేగాక రాబోయే రోజుల్లో విజయవాడ, చెన్నై, ముంబై, హైదరాబాద్, కొచ్చిన్కు విమాన సర్వీసులు ఏర్పాటు చేస్తామని అల్ టేయర్ గ్రూప్ సీఈఓ ఫర్హాద్ తెలిపారు. మంగళవారం అల్ జజీరా ఎయిర్వేస్కు చెందిన ఓ విమానం కూడా 162 మంది ప్రయాణీకులతో విజయవాడకు వచ్చింది. అయితే, ప్రస్తుతానికి భారతదేశం నుండి కువైట్కు ప్రయాణీకులను తీసుకువెళ్లడానికి షెడ్యూల్ విమానాలు లేవని సమాచారం.