ప‌త్తాలేకుండా పోయిన.. ఆ 453 మంది..

ABN , First Publish Date - 2020-03-28T14:17:40+05:30 IST

కరోనా వైరస్‌ విదేశాల నుంచి వచ్చిన వారి నుంచే వ్యాపిస్తోంది. దీంతో వివిధ దేశాల నుంచి భారత్‌కు వచ్చేవారిపై నిఘా పెట్టాలని కేంద్రం మొత్తుకుంటోంది.

ప‌త్తాలేకుండా పోయిన.. ఆ 453 మంది..

విదేశాల నుంచి వచ్చి ‘గల్లంతు’

చిరునామాల్లో ఉండడం లేదని వెల్లడి

విశాఖ జిల్లా అధికారుల్లో ఆందోళన

స్వచ్ఛందంగా ముందుకు రావాలని విజ్ఞప్తి

కేంద్రం పంపిన జాబితాల్లో 3,746 మంది

ఇప్పటికే అప్రమత్తం చేసిన కేంద్రం

(విశాఖపట్నం - ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ విదేశాల నుంచి వచ్చిన వారి నుంచే వ్యాపిస్తోంది. దీంతో వివిధ దేశాల నుంచి భారత్‌కు వచ్చేవారిపై నిఘా పెట్టాలని కేంద్రం  మొత్తుకుంటోంది. తగిన పరీక్షలు నిర్వహించుకుని, క్వారంటైన్‌లో ఉండాలని రాష్ట్రమూ పదేపదే చెబుతోంది. చివరికి...  విదేశాల నుంచి వచ్చిన వారి సంఖ్యకూ, నిఘాలో ఉన్న వారి సంఖ్యకు మధ్య వ్యత్యాసం చాలా ఉందని కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబా పేర్కొన్నారు. ఎక్కడో తేడా కొడుతోందని... దీనిపై ఆరా తీయాలని శుక్రవారం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేశారు. కేంద్రం అనుమానం అక్షరాలా నిజం. ఎందుకంటే... ఒక్క విశాఖపట్నం జిల్లాలోనే 453  ‘విదేశీ ప్రయాణికులు’ కనిపించడంలేదు. వారంతా ఏమయ్యారో, ఎటు వెళ్లారో అంతుచిక్కడం లేదు.


దీంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది. కరోనా వైరస్‌ వ్యాప్తిలోకి వచ్చిన తర్వాత ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు విదేశాల నుంచి విశాఖకు వివిధ మార్గాల్లో వచ్చిన వారి వివరాలను జిల్లా అధికారులు సేకరించారు. ఇటీవల వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని నగరానికి వచ్చినప్పుడు విదేశాల నుంచి మొత్తం 3,746 మంది విశాఖ వచ్చారని ప్రకటించారు. వారిని మండలాల వారీగా విభజించి, ఆ జాబితాలను ఆయా తహసీల్దార్లకు పంపించి సర్వే చేయిస్తున్నామని చెప్పారు. వారు 14 రోజులు క్వారంటైన్‌లో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. అత్యధికంగా విశాఖ అర్బన్‌ జిల్లాలో 649 మంది, గాజువాక మండలంలో 476 మంది ఉన్నారని తెలిపారు.


2,795 మందికే తాజా లెక్కలు

జిల్లా అధికారులు కరోనా వివరాలను శుక్రవారం మీడియాకు వెల్లడిస్తూ 2,795 మంది మాత్రమే విదేశాల నుంచి వచ్చారని, వారంతా హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్నారని పేర్కొన్నారు. వారిలో 28 రోజులు పూర్తయినవారు 137 మంది, 15-27 రోజులు పూర్తయినవారు 999 మంది, 14 రోజులలోపు వారు 1,498 మంది ఉన్నారని వివరించారు. అయితే మంత్రి చెప్పిన సంఖ్యకు వెయ్యి మంది తక్కువ ఉన్నారని, వారంతా ఏమయ్యారని ‘ఆంధ్రజ్యోతి’ ప్రశ్నించగా.. కలెక్టర్‌ వినయ్‌చంద్‌ సమాధానమిచ్చారు. తొలుత కేంద్రం నుంచి 1,188 మందితో జాబితా వచ్చిందని, వారి కోసం ఇంటింటి సర్వే చేస్తుండగా 221 మంది జాబితాలో లేనివారు కనిపించారని అన్నారు. రెండో విడత మరో 2,337 మందితో జాబితా వచ్చిందన్నారు. 


వారి కోసం మళ్లీ సర్వే చేయగా విశాఖ వచ్చి తిరిగి విదేశాలకు వెళ్లిపోయినవారు 31 మంది, ఇతర రాష్ట్రాలకు వెళ్లినవారు 81 మంది, ఇతర జిల్లాలకు వెళ్లిపోయినవారు 20 మంది ఉన్నట్టు తేలిందన్నారు. ప్రస్తుతం విశాఖ నగరంలోనే విదేశాల నుంచి వచ్చినవారు 2,224 మంది, గ్రామీణ జిల్లాలో 525 మంది ఉన్నారన్నారు. ఇక మొదటి, రెండో జాబితాల్లో కొన్ని పేర్లు డూప్లికేట్‌ అయ్యాయని, వాటికి కూడా తీసివేయగా.. 453 మంది ఆచూకీ లభించడం లేదని కలెక్టర్‌ వివరించారు. కొందరు పాస్‌పోర్టులో పేర్కొన్న చిరునామాల్లో లేరని, ఎక్కడికి వెళ్లిపోయారో తెలియడం లేదని చెప్పారు. అటువంటి వారు ఎవరైనా ఉంటే.. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వివరాలు తెలియజేయాలని కోరారు.

Updated Date - 2020-03-28T14:17:40+05:30 IST