ఇరాన్లో 300 మంది ఉసురు తీసిన 'కరోనా' వదంతి..!
ABN , First Publish Date - 2020-03-28T13:40:45+05:30 IST
కరోనా ఇరానీయులను వణికిస్తోంది. ఎంతలా అంటే.. విషం తాగితే వైరస్ సోకదని ఎవరైనా చెబితే నమ్మి.. తాగేసేంతలా. దాదాపు ఇలాంటి ఘటనే తాజాగా అక్కడ జరిగింది.
![ఇరాన్లో 300 మంది ఉసురు తీసిన 'కరోనా' వదంతి..!](https://media.andhrajyothy.com/appimg/galleries/2020032808091169/03282020080951n22.jpg)
వణికిస్తున్న ‘కరోనా’ వదంతులు
టెహ్రాన్ (ఇరాన్), మార్చి 27: కరోనా ఇరానీయులను వణికిస్తోంది. ఎంతలా అంటే.. విషం తాగితే వైరస్ సోకదని ఎవరైనా చెబితే నమ్మి.. తాగేసేంతలా. దాదాపు ఇలాంటి ఘటనే తాజాగా అక్కడ జరిగింది. సోషల్ మీడియాలో వైరలైన ఓ వార్త.. 300 మంది ఉసురు తీసింది. ఆల్కహాలిక్ శానిటైజర్ కరోనాను చంపేస్తుందని, కాబట్టి మద్యం తాగితే కరోనా సోకదన్న వదంతిని నమ్మిన జనం.. మద్యం కోసం ఎగబడ్డారు. ఇరాన్లో మద్యపానంపై నిషేధం ఉంది. దీంతో అక్రమ సరఫరాదారులు అమ్మిన.. మిథైల్ ఆల్కహాల్ తాగేసి 300 మంది ప్రాణాలు కోల్పోయారు. వెయ్యి మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇరాన్లో ఇప్పటివరకు మిథైల్ ఆల్కహాల్ తాగి 480 మంది చనిపోయారు. తాజా ఘటనతో అప్రమత్తమైన సర్కారు.. పారిశ్రామిక అవసరాలకు వాడే మిథైల్ ఆల్కహాల్ రంగును మార్చాల్సిందిగా ఉత్పత్తిదారులను ఆదేశించింది.